తెలంగాణలో జులై 6న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో ఆయా ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.
నల్గొండ, సిద్దిపేట యాదాద్రి, భువనగిరి,రంగారెడ్డి, హైదరాబాద్,మేడ్చల్ మల్కాజిగిరి,వికారాబాద్, సంగారెడ్డి,మెదక్,కామారెడ్డి జిలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు చెప్పారు.
జులై 7,8 తేదీల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. గత రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజా హెచ్చరికల క్రమంలో ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.