హైదరాబాద్: భద్రాద్రిలో రేపు జరగబోయే శ్రీరామ పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరాజన్ హాజరుకానున్నట్లు రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. కాగా గవర్నర్ ఈ రోజు సాయంత్రం భద్రాద్రికి బయలుదేరుతారని సమాచారం. గవర్నర్ సికింద్రాబాద్ నుంచి రైల్ లో కొత్తగూడెం వెళ్లనున్నారు. కొత్తగూడెం నుంచి రోడ్డుమార్గంలో భద్రాచలం వెళ్లనున్నారు. ఈ రోజు సీతారాముల కల్యాణోత్సవం జరుగనుండగా.. రేపు శ్రీ రాములవారి పట్టాభిషేక మహోత్సవం జరుగునుంది. గవర్నర్ రేపు జరుగబోయ్యే శ్రీరామచంద్ర పట్టాభిషేక మహోత్సవంలో పాల్గొననున్నారు.
గత రెండేళ్లుగా కరోనా విజృంభణతో స్వామివారి కళ్యాణానికి భక్తులకు అనుమతిలేదు. ఈ సారి కరోనా తగ్గుముఖం పట్టడంతో అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సీతారాముల కల్యాణం కోసం మిథిలా స్టేడియంను విద్యుత్ దీపాలతో అందంగా తయారు చేసి, స్వాగత ద్వారాలను ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారి కల్యాణాన్ని చూసేందుకు ఎల్ఈడీ టీవీలు పెట్టారు. 170 క్వింటాళ్ల తలంబ్రాలు, 2 లక్షల లడ్డూలు సిద్ధం చేశారు. మొత్తం 50 తలంబ్రాల కౌంటర్లు, 30 లడ్డూల కౌంటర్లు ఏర్పాటు చేశారు.