
రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా జంటగా ఎ.ఎస్.రవికుమార్ చౌదరి దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన చిత్రం ‘తిరగబడర సామీ’. ఈ మూవీ ఆగస్ట్ 2న థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో మేకర్స్ వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు (జూలై 31) ప్రెస్మీట్లో పాల్గొన్నారు. ఈ ప్రెస్మీట్లో లావణ్య వివాదంపైనే రాజ్ తరుణ్కు చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. వివరాల్లోకి వెళితే..
గత కొన్ని రోజులుగా లావణ్య వివాదంతో బయటకి రాని రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వి మల్హోత్రా తాజాగా తిరగబడరా సామి ప్రమోషన్స్ కి రాగా మీడియా లావణ్య వివాదం గురించి, అలాగే తన ఫ్యూచర్ సినిమాల గురించి పలు విభిన్న ప్రశ్నలు అడిగారు.
అందులో భాగంగా లావణ్య వివాదం తర్వాత ఎందుకు ఎక్కువగా బయట కనపడలేదు, అలాగే మీ గత సినిమా పురుషోత్తముడు ప్రమోషన్స్ కి కూడా ఎక్కడ కనిపించనేలేదు అని ప్రశ్నించగా.." నేను మనిషినే, నాకు బాధేస్తుంది. నేను ఎఫెక్ట్ అవుతాను. వాళ్ళ లాగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేను. నేను చాలా ఎఫెక్ట్ అయ్యాను. మన మంచితనాన్ని ఆసరాగా తీసుకొని ఇలా చేస్తే నాకు బాధ వేయదా? ఆ బాధతోనే ఇన్నాళ్లు బయటకు రాలేదు.
నేను మామూలుగానే సెన్సిటివ్ పర్సన్ అందుకే బయటకి రాలేదు. నేను ఇంకా అలాగే ఉండేవాడిని ఇంట్లో. మా పేరెంట్స్, ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అవుతున్నారు. అందుకే ఇవాళ మీ ముందుకు వచ్చి సమాధానాలు చెప్పాలని బయటకి వచ్చాను. నేను చాలా ధైర్యం తెచ్చుకొని బయటకి వచ్చాను. ఇంకా ఇలాంటివి అడిగి బాధపెట్టకండి. నేను ఏదైనా లీగల్ గా ప్రొసీడ్ అవుతాను. నా 32 ఏళ్ల జీవితం లో వేలాది మంది తెలిసి ఉన్నారు. ఎవరైనా ఒక్కరు వచ్చి నా మీద చెడుగా చెప్పమని చెప్పండి అని అన్నారు.
అంతేకాకుండా..పెళ్లి చేసుకొని వదిలేశావని, అబార్షన్ చేయించావని లావణ్య మీడియా ముందుకు వచ్చి అన్ని ఆరోపణలు చేస్తున్నా మీరెందుకు మీడియా ముందుకు రాలేదని రాజ్తరుణ్ను ప్రశ్నించారు. "ఈ విషయంపై లీగల్గా ముందుకు వెళతానని, తాను ఎలాంటి తప్పు చేయలేదనే నిరూపించుకుంటానని చెప్పారు. అలాగే తనను మోసం చేశానంటున్న లావణ్య ఎక్కడైనా ఆధారాలు చూపించిందా? దీనిపై ముందుగా నేనే మీడియాతో మాట్లాడాను. నేను మాట్లాడే ప్రతి మాటా పచ్చి నిజం. అందుకు నా దగ్గర చాలా సాక్ష్యాలున్నాయి. నేనింకా వాటిని బయటపెట్టలేదు. అయితే తాను అబార్షన్ చేయించినట్టు ఎఫ్ఐఆర్లో ప్రస్తావించలేదని రాజ్ తరుణ్ స్పష్టం చేశారు. దానిపై కేసు ఎందుకు లేదని అన్నారు. లావణ్య నుంచి తనకు నోటీసులు వచ్చాయని, తాను స్పందించానని రాజ్ తరుణ్ చెప్పారు. ఈ విషయం గురించి ఇక తాను మాట్లాడనని అన్నారు.
అలాగే ఈ విషయంలో తనకోసం నిలబడ్డ ఆర్జే శేఖర్ బాషా ను స్టేజిపైకి పిలిచి రాజ్ తరుణ్ హత్తుకున్నారు. నా జీవితంలో చాలా తక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చాను అతనికి. కేవలం మూడు, నాలుగు సార్లే కలిసాను అతన్ని. కానీ నా కోసం శేఖర్ భాష నిలబడ్డాడు. నా కోసం చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. నేను నీకు జీవితాంతం రుణబడి ఉంటాను అంటూ ఎమోషనల్ అయి శేఖర్ భాషాను స్టేజిపైకి పిలిచి హగ్ చేసుకోవడం విశేషం.