- గొడవతో గెహ్లాట్కు సంబంధంలేదు
- రాజస్థాన్లో పరిస్థితిపై సోనియాకు మాకెన్ రిపోర్టు
న్యూఢిల్లీ: రాజస్థాన్ కాంగ్రెస్లో సంక్షోభానికి కారణం ముగ్గురు ఎమ్మెల్యేనని, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ రాష్ట్ర ఇన్చార్జి అజయ్ మాకెన్ హైకమాండ్కు తేల్చిచెప్పారు. సీఎం అశోక్ గెహ్లాట్కు ఈ వ్యవహారంలో సంబంధం లేదంటూ క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం పార్టీ చీఫ్ సోనియా గాంధీకి రిపోర్టు అందజేశారు. పార్టీ ఎమ్మెల్యేలలో.. చీఫ్ విప్ మహేశ్ జోషి, ఆర్టీడీసీ చైర్మన్ ధర్మేంద్ర రాథోడ్, శాంతి కుమార్ ధరీవాల్లపై చర్యలు తీసుకోవాలన్నారు. పార్టీ కట్టుబాట్లను తప్పి, ఎమ్మెల్యేలతో కలిసి మీటింగ్ పెట్టడం తీవ్ర క్రమశిక్షణారాహిత్యమని ఆరోపించారు. ఓవైపు సీఎల్పీ మీటింగ్కు హాజరుకావాలని హైకమాండ్ ఆదేశించినా వినిపించుకోకుండా, మీటింగ్ పెట్టి తదుపరి సీఎం ఎన్నికపై తీర్మానం చేశారని మాకెన్ విమర్శించారు. రాజస్థాన్ సీఎం రేసు నుంచి సచిన్ పైలట్ను తప్పించాలని ఈ మీటింగ్లో చర్చించారన్నారు. గెహ్లాట్ను సీఎం పోస్టు నుంచి తప్పిస్తే మూకుమ్మడిగా రాజీనామాలు చేయనున్నట్లు ఆ తీర్మానంలో వివరించారని చెప్పారు. ఈ వ్యవహారంతో సీఎం గెహ్లాట్కు ఎలాంటి సంబంధంలేదని మాకెన్ తన రిపోర్టులో పేర్కొన్నారు. మాకెన్ రిపోర్టుతో సదరు ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పదిరోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ అందులో పార్టీ హైకమాండ్ ఆదేశించినట్లు వివరించాయి. తాజా పరిణామాల నేపథ్యంలో పార్టీ ప్రెసిడెంట్ రేసులో అశోక్ గెహ్లాట్ ఉండకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ఎన్నికల్లో గెహ్లాట్ పోటీ చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. నామినేషన్ వేసేందుకే గెహ్లాట్ సుముఖంగా ఉన్నారని చెప్పాయి. మరోవైపు, మంగళవారం మధ్యాహ్నం సచిన్ పైలట్ ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన తన పర్సనల్ పనిమీదనే ఢిల్లీకి వెళ్లారని పైలట్ అనుచరులు చెప్పారు.