ఏడేళ్ల బాలికతో 38ఏళ్ల వ్యక్తి పెళ్లి.. రూ.4.5 లక్షలకు కొనుగోలు చేసిన వరుడి కుటుంబం

ఏడేళ్ల బాలికతో 38ఏళ్ల వ్యక్తి పెళ్లి.. రూ.4.5 లక్షలకు కొనుగోలు చేసిన వరుడి కుటుంబం

రోజుకో సాంకేతిక పుట్టుకొస్తున్నా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం అనారికత మాత్రం అలాగే పేరుకుపోయింది. అవగాహన లేమితో కొందరు తమ పిల్లల్ని సైతం అమ్ముకోవడం, బాల్య వివాహాలు చేయడం అత్యంత దారుణమైన పరిస్థితులకు నిలువుటద్దంగా పరిణమిస్తోంది. అందులో భాగంగానే తల్లిదండ్రులు తమ ఏడేళ్ల బాలికను మధ్యవయస్కుడైన వ్యక్తికి పెళ్లి చేసేందుకు రూ. 4.50 లక్షలకు విక్రయించారు.

రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఏడేళ్ల బాలికను 38 ఏళ్ల భూపాల్ సింగ్ కు పెళ్లికి నిశ్చయించారు. అంతే కాదు అతనితో పెళ్లి రూ. 4.50 లక్షలకు ఆ బాలికను విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. వరుడి కుటుంబం నుంచి మొత్తాన్ని స్వీకరించి, బదులుగా తమ కుమార్తెను ఆ మధ్యవయస్కుడితో వివాహం జరిపించినట్టు వెల్లడించారు. మే 23న జరిగిన ఈ సంఘటన.. జిల్లాలోని మానియా ప్రాంతంలో జరిగినట్టు పోలీసులు తెలిపారు.

మధ్యప్రదేశ్‌లో ఓ హత్య కేసులో జైలు శిక్ష తర్వాత నిందితుడి కుటుంబం గ్రామంలో స్థిరపడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. బాలికను కొనుగోలు చేసి మధ్యవయస్కుడితో వివాహం చేసినట్లు తమకు సమాచారం అందిందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ధోల్పూర్) మనోజ్ కుమార్ తెలిపారు. ఆ తర్వాత డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (మానియా) దీపక్ ఖండేల్వాల్ నేతృత్వంలోని బృందం బాలికను స్వాధీనం చేసుకుని, వారి ఇంటిపై దాడి చేశారు.

బాలిక తండ్రికి రూ. 4.50 లక్షలు చెల్లించి సింగ్ కుటుంబ సభ్యులు అమ్మాయిని కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నారని పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో ఎవరెవరు, ఎంత మంది ప్రమేయం ఉందనే దానిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని, అందుకు తగిన సమాచారం సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.