
ఈడెన్ గార్డెన్స్లో రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ సాధించింది. కోల్ కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచులో 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ సునామీ ఇన్నింగ్స్ (95)కు తోడు..కెప్టెన్ సంజూ శాంసన్ (50) చెలరేగడంతో 150 పరుగుల టార్గెట్ను రాజస్థాన్ కేవలం 13.1 ఓవర్లలోనే ఛేదించింది.
150 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఓపెనర్ యశస్వీ జైస్వాల్ దుమ్మురేపాడు. బట్లర్ (0) విఫలమైనా...జైస్వాల్ మాత్రం ఆరంభం నుంచి కోల్ కతా బౌలర్లపై విరుచుకుపడ్డాడు...తొలి ఓవర్లో వరుసగా 6,6,4,4,0,4 బాదాడు.రెండో ఓవర్లో ఓ ఫోర్, ఓ సిక్స్ కొట్టాడు. ఇక శార్ధూల్ ఠాకూర్ వేసిన 3వ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు. ఓ సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
శాంసన్ ..జైస్వాల్..
హాఫ్ సెంచరీ తర్వాత జైస్వాల్ (98) మరింత రెచ్చిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. కెప్టెన్ సంజూ శాంసన్ కూడా అదరగొట్టాడు. కేవలం 29 బంతుల్లోనే 5 సిక్సులు, 2 ఫోర్లతో 48 పరుగులు చేశాడు. వీరిద్దరు రెండో వికెట్ కు అజేయంగా 121 పరుగులు జతచేశారు. వీరిద్దరూ అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చారు.
అంతకుముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులే చేసింది. కోల్కతా 14 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. జేసన్ రాయ్ (10: 8 బంతుల్లో, రెండు ఫోర్లు) ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే రహ్మనుల్లా గుర్బాజ్ (18: 12 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) 29 పరుగుల వద్ద వెనుదిరిగాడు.
ఆదుకున్న అయ్యర్..
ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన వెంకటేష్ అయ్యర్ (57: 42 బంతుల్లో, రెండు ఫోర్లు, నాలుగు ఫోర్లు), కెప్టెన్ నితీష్ రాణా (22: 17 బంతుల్లో, రెండు ఫోర్లు) జట్టును ఆదుకున్నారు. మూడో వికెట్కు ఇద్దరు 48 పరుగులు జోడించారు. అయితే ఈ స్థితిలో చాహల్ నితీష్ రాణాను పెవీలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన ఆండ్రీ రసెల్ (10: 10 బంతుల్లో, ఒక సిక్సర్) త్వరగానే ఔటయ్యాడు. రింకూ సింగ్ (16: 18 బంతుల్లో, ఒక సిక్సర్) విలువైన పరుగులు చేయలేకపోయాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా..వెంకటేష్ అయ్యర్ రాజస్థాన్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.
అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే వెంకటేష్ అయ్యర్ కూడా అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మన్ త్వరగానే పెవీలియన్ చేరడంతో కోల్ కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులే చేసింది. రాజస్తాన్ బౌలర్లలో చాహల్ 4 వికెట్లు పడగొట్టాడు. బౌల్ట్కు 2 వికెట్లు దక్కాయి. సందీప్ శర్మ, కేఎం ఆసిఫ్ చెరో వికెట్ తీశారు.