మాస్కులు తప్పనిసరి.. రాజస్థాన్‌‌లో కొత్త చట్టం

మాస్కులు తప్పనిసరి.. రాజస్థాన్‌‌లో కొత్త చట్టం

జైపూర్: కరోనా వ్యాప్తి తగ్గని నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. మాస్కులు తప్పక కట్టుకోవాలని, వ్యాక్సిన్ వచ్చే వరకు మాస్కే వ్యాక్సిన్ అని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా జాగ్రత్తల విషయంలో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మాస్కు తప్పక కట్టుకోవాలంటూ కొత్త చట్టాన్ని తీసుకురానున్నామని తెలిపారు. దీంతో దేశంలో మాస్కు తప్పక ధరించాలని రూల్ తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా రాజస్థాన్ నిలవనుందన్నారు.

‘కరోనా నుంచి రక్షణగా మాస్కులు తప్పక కట్టుకోవాలని దేశంలో చట్టం తీసుకురానున్న తొలి రాష్ట్రంగా రాజస్థాన్‌‌ నిలవనుంది. ఎందుకంటే కరోనా నుంచి కాపాడుకోవాలంటే మాస్క్ తప్పనిసరి. మాస్క్ వ్యాక్సిన్ లాంటిది. మాస్క్ మనల్ని రక్షిస్తుంది. రాష్ట్రంలోకరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజాందోళనలకు మద్దతుగా మాస్కు తప్పక కట్టుకునేలా మా సర్కార్ కొత్త చట్టాన్ని తీసుకురానుంది’ అని అశోక్ గెహ్లాట్ ట్వీట్ చేశారు. దీంతోపాటు కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో రానున్న దీపావళి సీజన్‌కు ఫైర్‌‌క్రాకర్స్ అమ్మకాలపై గెహ్లాట్ సర్కార్ బ్యాన్ వేసింది. రాజస్థాన్‌‌లో నవంబర్ 30 వరకు స్విమ్మింగ్ పూల్స్, సినిమా హాల్స్, థియేటర్స్, మల్టీప్లెక్సెస్, ఎంటర్‌టైన్‌‌మెంట్ పార్క్స్‌‌ను మూసేసి ఉంచనున్నారు.