
రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో రూపేష్ చౌదరి హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘షష్టిపూర్తి’.అర్చన, ఆకాంక్ష సింగ్ ఇతర ముఖ్యపాత్రలను పోషించారు. పవన్ ప్రభ దర్శకుడు. మే 30న సినిమా విడుదలవుతున్న సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ ఇలా ముచ్చటించారు.
‘‘మనం ఏ పాత్రలు పోషించినా.. ఆ పాత్రలే జనాలకు గుర్తుండాలనేది నా సూత్రం. ఇప్పటికీ నాకోసం ఇలాంటి పాత్రలు రాస్తున్నారంటే అది నా అదృష్టం. పిల్లలు తల్లిదండ్రుల పెళ్లిని చూడలేరు. కానీ 60వ పెళ్లిని మాత్రం చూడగలరు. అందుకే ‘షష్టిపూర్తి’కి అంత ప్రాధాన్యం. ఇలాంటి చిత్రాల్ని, పాత్రల్ని అస్సలు మిస్ అవ్వకూడదు. ఇందులో మూడు రకాల వేరియేషన్స్ ఉంటాయి.
‘లేడీస్ టైలర్’మూవీ మాడ్యులేషన్, గెటప్ కావాలని దర్శకుడు పట్టుబట్టడంతో చాలా ఈజీగా పోషించాను. ఇందులో నవ్విస్తాను, ఏడిపిస్తాను. ఈ చిత్రం చూసిన ప్రతీ ఒక్కరూ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి వారిని ప్రేమగా పలకరిస్తారు. ‘లేడీస్ టైలర్’తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు నేను, అర్చన కలిసి నటించాం. ఇళయరాజా గారు అద్భుతమైన పాటల్ని అందించారు. చైతన్య ప్రసాద్ మంచి సాహిత్యాన్ని ఇచ్చారు. కీరవాణి కూడా మా కోసం పాట రాశారు.
నేను ఎంతో సంతృప్తిగా ఫీల్ అయిన చిత్రమిది. ఇది ప్రతి ఇంట్లో జరిగే కథ. తెలుగు వారిని ప్రతిబింబించేలా ఉంటుంది. ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. గొప్ప చిత్రం అవుతుందని కచ్చితంగా చెప్పగలను. ఇక ఓ నటుడిగా నాకు గత 48 ఏళ్లుగా పని దొరుకుతూనే ఉంది.
ఇప్పుడు కూడా నా చేతిలో 11 ప్రాజెక్టులున్నాయి. ఇంకో నాలుగు చర్చల దశలో ఉన్నాయి. ఇక ప్రస్తుత సినిమాల్లో కామెడీ తగ్గడానికి కారణం రచయితలే. మా టైమ్లో రాసినట్టుగా కామెడీ టైమింగ్, రైటింగ్ ఇప్పుడు కనిపించడం లేదు. కామెడీ ఇంకా బెటర్ అవ్వాలని నేను కోరుకుంటున్నా’’అని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.