- అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షుడు అశోక్ దావలె
- కొత్తగూడెంలో రైతు సంఘం రాష్ట్ర మహాసభలు ప్రారంభం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన రామ్జీ చట్టం బోగస్ అని అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షుడు అశోక్ దావలె విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సామినేని రామారావునగర్లో గురువారం రైతు సంఘం రాష్ట్ర మహాసభలను ప్రారంభించారు. ముందుగా అమరులకు నివాళులర్పించారు.
అనంతరం అశోక్ దావలె మాట్లాడుతూ... ట్రేడ్ ఒప్పందాలు దేశానికే ప్రమాదకరంగా మారాయాని, పంటలకు కేంద్రం ప్రకటించిన మద్ధతు ధర బూటకం అన్నారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం ధాన్యం క్వింటాల్కు రూ. 3 వేలు ఇస్తోందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఇలా ఇస్తున్నారా ? అని ప్రశ్నించారు.
మద్ధతు ధరతో పాటు, దేశంలోని రైతులందరికీ రుణమాఫీ చేయాలని పోరాటాలు చేస్తామని చెప్పారు. ఇండియా, యూఎస్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం రైతులకే కాకుండా దేశానికే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. విదేశాంగ విధానంలో కేంద్ర ప్రభుత్వం విఫలం అయిందన్నారు. విత్తన రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం సీడ్ బిల్లు తీసుకొచ్చిందని ఆరోపించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతారన్నారు. ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్ మాట్లాడుతూ.. కమ్యూనిస్టులు పేదలకు భూములు పంచితే ఇప్పటి పాలకులు వాటిని గుంజుకుంటున్నారని మండిపడ్డారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
మోదీ ఆర్థిక సంస్కరణల ఫలితంగా రైతాంగం సంక్షోభంలోకి కూరుకుపోతోందన్నారు. కార్యక్రమంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, మాజీ ఎంపీ పోతినేని వీరభద్రం, సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం. సాయిబాబు, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి. వెంకట్, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్, మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, రైతు సంఘం రాష్ట్ర నేతలు సారంపల్లి మల్లారెడ్డి, అరిబండి ప్రసాద్, జంగారెడ్డి, కందాల ప్రమీల, వంశీకృష్ణ, వెంకట్రాం, శివరాం ప్రసాద్, బండారు రవికుమార్ పాల్గొన్నారు.

