20 ఏళ్ల తర్వాత రజనీకాంత్తో రమ్యకృష్ణ

20 ఏళ్ల తర్వాత  రజనీకాంత్తో రమ్యకృష్ణ

సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే ఇష్టపడని వారుండరు. ఒక్క తమిళనాడే కాదు..రజనీకి దేశ వ్యాప్తంగా అభిమానులున్నారు. అందుకే తలైవా సినిమాలు అన్ని భాషల్లో సూపర్ హిట్ అవుతాయి. సినిమా రిలీజైందంటే చాలు..థియేటర్లలో పండగ వాతావరణం ఉంటుంది. అయితే 2021లో రజనీకాంత్ నటించిన పెద్దన్న, 2020లోని దర్బార్ సినిమాలు పెద్దగా ఆడలేదు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీజ్ వద్ద బోల్తా కొట్టాయి. ఈ నేపథ్యంలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేందుకు రజనీకాంత్ జైలర్గా వస్తున్నాడు.  యాక్షన్‌ కామెడీగా  నెల్సన్ దిలీప్ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జైలర్ సినిమాను  సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మిస్తున్నారు. ఇందులో శివరాజ్‌కుమార్‌, మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. 

20 ఏళ్ల తర్వాత రజనీతో రమ్య కృష్ణ

జైలర్ సినిమాలో రమ్య కృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.  దాదాపు 20 ఏళ్ల తర్వాత రమ్యకృష్ణ రజనీకాంత్తో నటించబోతుంది. ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి వెండితెరపై సందడి చేయబోతుండటంతో జైలర్ సినిమాపై ఫ్యాన్స్ కు మరింత ఆసక్తి పెరిగింది. గతంలో రజనీ..రమ్యకృష్ణ నరసింహా  సినిమాలో నటించారు. ఆ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో మరోసారి వీరిద్దరు కలిసి నటించబోతున్నారు. అయితే జైలర్ లో రమ్యకృష్ణ రోల్ హైలెట్ గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. 

సౌత్ యాక్టర్లు అందరూ..

జైలర్ మూవీలో సౌతిండియాకు చెందిన అన్ని చిత్ర పరిశ్రమల్లోని సీనియర్ నటులు యాక్ట్ చేయబోతున్నరు. కన్నడ నుంచి శివరాజ్ కుమార్, తమిళనాడు నుంచి రజనీకాంత్, మలయాళం నుంచి మోహన్ లాల్, తెలుగు నుంచి సునీల్ ఇందులో నటిస్తున్నారు. ఇక జైలర్ మూవీలో రజనీకాంత్ కు జోడిగా తమన్నా యాక్ట్ చేస్తోంది.