బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ నటించిన తాజా చిత్రం 'షంషేరా'. అత్యంత భారీ స్థాయిలో కరణ్ మల్హోత్ర ఈ సినిమను తెరకెక్కించాడు. యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా ఈ మూవీని నిర్మించారు. ఇందులో వాణీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. 1871 నేపథ్యంలో బ్రిటీష్ కాలం నాటి పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ మూవీ జూలై 22న హిందీతో పాటు తమిళ తెలుగు భాషల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
ఈ నేపథ్యంలో శనివారం మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ విషయానికొస్తే..‘ఆ మనిషిదే ఈ కథ.. బానిసత్వానికి మించిన నరకం వేరేలేదని అతను అనేవాడు. యాచించడానికి స్వాతంత్య్రం భిక్ష కాదని, పోరాడి సాధించుకోవాలని చెప్పేవాడు’ అంటూ ట్రైలర్ మొదలైంది. ఇందులో రణ్ బీర్ కపూర్ బందిపోటు గజదొంగ 'షంషేరా'గా కనిపించనున్నాడు. రణ్బీర్ తండ్రి, కొడుకులుగా రెండు పాత్రల్లో నటిస్తున్నాడు. చారిత్రక నేపథ్యంతో కూడిన యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. అనయ్ గోస్వామి కెమెరా విజువల్స్ అకట్టుకున్నాయి.