హైదరాబాద్లో నిజాయితీ చాటుకున్న ర్యాపిడో ఆటో డ్రైవర్

హైదరాబాద్లో నిజాయితీ చాటుకున్న ర్యాపిడో ఆటో డ్రైవర్

పద్మారావునగర్, వెలుగు: ఓ ప్రయాణికుడు మరిచిపోయిన డబ్బులు పోలీసులకు అప్పగించి ఆటో డ్రైవర్​ నిజాయితీని చాటుకున్నాడు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం డిండి గ్రామానికి  చెందిన హరిలాల్‌ నగరానికి వచ్చి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన జానకీరామ్‌ సోమవారం హరిలాల్‌ ఆటోను ర్యాపిడో యాప్‌ ద్వారా బుక్‌ చేసుకున్నాడు. మెట్టుగూడలో దిగిన ప్రయాణికుడు తన బ్యాగును ఆటోలో మర్చిపోయాడు. 

కొంతదూరం వెళ్లిన తర్వాత బ్యాగ్ మర్చిపోయిన సంగతి సదరు ఆటోడ్రైవర్‌ గుర్తించి అతడికి ఫోన్‌ చేశాడు. పోలీసుల సమక్షంలో జానకీరామ్‌కు అందజేశాడు. బ్యాగులో రూ.లక్షా 90 వేల నగదు ఉన్నట్లు ప్రయాణికుడు తెలిపాడు. అనంతరం నిజాయతీ చాటుకున్న హరిలాల్‌కు చిలకలగూడ పోలీసులు శాలువాతో సన్మానించారు.