ఇవి కొన్ని వేల ఏండ్ల నాటి చెట్లు. ఇప్పుడు శిలాజాలుగా మారి ఇలా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఒకప్పుడు టెంపరేచర్లు పెరగడం వల్ల పెద్ద పెద్ద చెట్లు నేలలోకి కూరుకుపోయి ఇలా మారాయి. ఈ అరుదైన వుడ్ ఫాజిల్స్ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలోని పెంచికల్ పేట్ రేంజ్ కొండపల్లి అడవుల్లో ఉన్నాయి.
ఈ వుడ్ ఫాజిల్స్ (వృక్ష శిలాజాలు) కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఏర్పడినట్లు ఆర్కియాలజిస్ట్లు చెప్తున్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం గోదావరి, దాని ఉపనది అయిన ప్రాణహిత కారిడార్లో వాతావరణంలో అనేక మార్పులు జరిగాయి. ఆ మార్పుల వల్ల పెద్ద పెద్ద చెట్లు ఇలా శిలాజాలుగా మారాయి. ఇవి దాదాపు 20 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. .
ఇలా గుర్తించారు
ఫారెస్ట్ అధికారులు 2015లో మొట్టమొదటగా వీటిని గుర్తించారు. తర్వాత అప్పటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామ్మోహన్ ఈ విషయాన్ని గవర్నమెంట్కు చెప్పారు. అంతేకాకుండా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తరఫున ఈ ఫాజిల్స్పై గవర్నమెంట్కు నివేదిక ఇచ్చారు. 2016లో స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్లు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ ఈ అడవికి వచ్చి వుడ్ ఫాజిల్స్పై రీసెర్చ్ చేశారు. ఇవి కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటివని అప్పుడే తెలిసింది.
డెవలప్ చేస్తే మేలు
కొండపల్లి అడవుల్లోని ఈ శిలాజాలు వర్షాకాలంలో వరదలకు కొట్టుకునిపోతున్నాయి. వీటిని కాపాడేందుకు గవర్నమెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దేశంలోని మహారాష్ర్ట, మధ్యప్రదేశ్, తమిళనాడు, హిమాచల్ప్రదేశ్లో ఇలాంటి వుడ్ ఫాజిల్స్తో పార్కులు ఏర్పాటు చేశారు. దాంతో ఆ ప్రాంతాల్లో టూరిజం బాగా డెవలప్ అయ్యింది. అలాగే ఇక్కడ కూడా ఈ శిలాజాలతో పార్కు ఏర్పాటు చేస్తే వాటిని కాపాడడంతోపాటు టూరిజాన్ని డెవలప్ చేసినట్టవుతుంది.
కాపాడుతాం
కొండపల్లి ఫారెస్ట్ ఏరియాలో ఉన్న వుడ్ ఫాజిల్స్ ని కాపాడేందుకు చర్యలు తీసుకుంటాం. ఆర్కియాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్టుమెంట్లతో ఈ విషయంపై మాట్లాడాం. ఏళ్ల నాటి శిలాజాలు కాపాడేందుకు కచ్చితంగా కృషి చేస్తాం. - శాంతారామ్, డీఎఫ్ఓ. ::: ఆసిఫాబాద్, వెలుగు