ఎన్సీలాట్ తీర్పుకు వ్యతిరేకంగా టాటాల పిటిషన్
న్యూఢిల్లీ: సైరస్ మిస్త్రీకి అనుకూలంగా ఇచ్చిన ఎన్సీలాట్ తీర్పును సవాలు చేస్తు టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా శుక్రవారం సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్, టాటా సన్స్ వేసిన పిటిషన్ రెండు వేరువేరు కావడం విశేషం. ఎన్సీలాట్ తీర్పు తప్పని, ఇది టాటా సన్స్ను రెండు గ్రూప్ల కంపెనీగా పరిగణిస్తోందని పిటిషన్లో రతన్ టాటా పేర్కొన్నారు. షాపూర్జి పల్లోంజి(ఎస్పీ) గ్రూప్ తరపున కాకుండా, మిస్త్రీ స్వయంగా టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అయ్యారని అన్నారు. హక్కు ఉంది కాబట్టి ఎస్పీ గ్రూప్ నుంచి ఒకరు డైరక్టర్గా ఉన్నారనే తప్పు అర్థాన్ని ఎన్సీలాట్ ఆర్డర్ ఇస్తోందని తెలిపారు. ఇది నిజం కాదని, టాటా సన్స్ ఆర్టికల్ అసోసియేషన్కు వ్యతిరేకమన్నారు. మిస్త్రీ ఛైర్మన్ అయ్యాక పవర్ , అథారిటీని తన చేతుల్లో ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేశాడని ఆరోపించారు. సైరస్ మిస్త్రీని ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా తిరిగి నియమించాలంటూ గత నెల 18న ఎన్సీలాట్ తీర్పిచ్చింది.

