ఇబ్రహీంపట్నం/మల్కాజిగిరి, వెలుగు: భారీగా రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు సివిల్ సప్లై ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ నర్సింహారెడ్డి తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్లోని సెజ్లో కందుల అఖిల్కుమార్ మారుతీ ఇండస్ట్రీస్ కోసం తీసుకున్న గోడౌన్ను మోహిజుద్దీన్ కు లీజుకి ఇచ్చాడు.
సోమవారం ఆ గోడౌన్లో మజారుద్దీన్, ఫిరోజ్, అర్జున్, రాహుల్ తో పాటు మరికొందరు కలిసి 360 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 15 క్వింటాళ్ల గోధుమలు తీసుకువచ్చి నిల్వ చేశారు. పక్కా సమాచారంతో దాడులు చేసి పట్టుకున్నారు. అనంతరం ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేయగా, మరో ఐదుగురు పరారీలో ఉన్నట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు.
మల్కాజిగిరిలో..
పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని మల్కాజిగిరి పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎస్సై ఈ.శంకర్ మంగళవారం తెల్లవారుజామున మౌలాలి ఆర్టీసీ కాలనీలో తనిఖీలు నిర్వహించి 80 సంచుల్లో నిల్వ చేసిన 38 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. మౌలాలీ ఆర్టీసీ కాలనీకి చెందిన డ్రైవర్ ఎండీ ఆదిల్ ను పోలీసులు పట్టుకోగా, ఎస్కే ఇమ్రాన్ అలియాస్ బబ్బు పరారయ్యాడు. వెహికల్తో పాటు బియ్యం సీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
