సైఫాబాద్, వెలుగు: పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ గన్పార్క్ వద్ద నిరసన తెలిపారు. నిరసనకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు బీసీ సంఘాల నేతలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.
రూ.10 వేల కోట్ల రీయింబర్స్మెంట్ బకాయిలు ఉండడంతో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. విద్యార్థులపై అమలు చేస్తున్న రెవెన్యూ రికవరీ చట్టాన్ని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేస్తే 14 లక్షల మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ను ఎత్తివేసే ఆలోచనను విరమించుకోవాలని, లేనిపక్షంలో ప్రజాభవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. బీసీ జేఏసీ కో-ఆర్డినేటర్ గుజ్జ కృష్ణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందగోపాల్, ఉదయ్ నేత, సానియా, వినయ్, వాణి, హణిత, పల్లవి, నందిని పాల్గొన్నారు.
నారాయణగూడ: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు కె. పవన్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణేశ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ హైదర్గూడలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 27 వేల పాఠశాలలను 4 వేలకు పరిమితం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. గ్రామీణ, పేద విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ డెవలప్మెంట్కు రూ.1,000 కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
