బెంగుళూర్‎లో రేవ్ పార్టీ భగ్నం.. 31 మంది అరెస్ట్.. సగం మంది ఐటీ ఉద్యోగులే..!

బెంగుళూర్‎లో రేవ్ పార్టీ భగ్నం.. 31 మంది అరెస్ట్.. సగం మంది ఐటీ ఉద్యోగులే..!

బెంగుళూర్: ఐటీ రాజధాని బెంగుళూర్‎లో రేవ్ పార్టీ కలకలం రేపింది. ఆదివారం (మే 25) అర్ధరాత్రి బెంగుళూర్ శివారులో ఓ ఫామ్ హౌస్‎లో జరిగిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేసి.. ఏడుగురు మహిళలు సహా 31 మందిని అరెస్ట్ చేశారు. ఘటన స్థలం నుంచి మూడు గ్రాముల కొకైన్, ఐదు గ్రాముల హైడ్రో-గంజ, 60 గ్రాముల హషీష్ ఆయిల్, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. బెంగళూరు అర్బన్ జిల్లా దేవనహళ్లి తాలూకాలోని కన్నమంగళ గ్రామంలోని ఒక ఫామ్‌హౌస్‌లో ఆదివారం (మే 25)  అర్ధరాత్రి రేవ్ పార్టీ నిర్వహించారు.

ఫామ్‌హౌస్‌‎లో అనుమానస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానికులు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. రేవ్ పార్టీ జరుగుతోన్న ఫామ్ హౌస్‎పై ఆకస్మిక దాడులు చేశారు. అక్కడ నిషేధిత డ్రగ్స్, గంజాయి, మద్యంతో పాటు ఓ డ్రగ్ స్మగ్లర్‎ను కూడా గుర్తించారు. మొత్తం పార్టీకి అటెండ్ అయిన వారిలో నలుగురు డ్రగ్స్‎తో పట్టుబడగా.. మిలిగిన వారికి డ్రగ్ టెస్టులు నిర్వహించారు. 

ALSO READ | కరోనా కేసుల్లో సెంచరీ కొట్టిన ఢిల్లీ : దేశంలో వెయ్యి దాటిన బాధితులు

ఫామ్‌హౌస్ యజమానితో సహా పార్టీకి హాజరైన 31 మందిపై  ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి.. మాదకద్రవ్యాలతో పట్టుబడిన నలుగురిని కోర్టులో హాజరుపరిచి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు ఈస్ట్ డివిజన్ డీసీపీ వీజే సాజిత్ తెలిపారు. మిగిలిన 27 మందిని స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశామని చెప్పారు. బెంగళూరులోని బనస్వాడి నివాసి మజార్ షరీఫ్ బర్త్ డే పేరుతో ఆన్ లైన్లో ఫామ్ హౌస్ బుక్ చేసి రేవ్ పార్టీ నిర్వహించినట్లు గుర్తించామని తెలిపారు. 

రేవ్ పార్టీలో పట్టుబడ్డ వారిలో చాలా మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారని వెల్లడించారు. పార్టీలో డ్రగ్స్ సప్లై చేసిన స్మగ్లర్ల కోసం గాలిస్తున్నామన్నారు. అక్కడ ఉన్నవారిలో ఒక మాదకద్రవ్యాల వ్యాపారి కూడా ఉన్నాడని పోలీసులు నిర్ధారించారు. 31 మందికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించామని.. ఫోరెన్సిక్ నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రేవ్ పార్టీలో 31 మంది అరెస్ట్ కావడం.. అందులో పలువురు ఐటీ ఉద్యోగులు ఉండటం బెంగుళూర్‎లో చర్చనీయాంశంగా మారింది.