
- మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ ధ్వజం
హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుండడంతో వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఆయనే తన బిడ్డ కవితతో లేఖ రాయించి ఉంటాడని మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ అన్నారు. ఆ లేఖ కవిత రాసిందో.. కేసీఆర్ రాయించారో తేలాలని డిమాండ్ చేశారు. సోమవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. గోబెల్స్ ప్రచారంలో ఆయన దిట్ట అని, తన లాంటి ఎంతో మంది తెలంగాణ ఉద్యమకారులను అణగదొక్కిన నీచుడు కేసీఆర్ అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
గతంలో మోదీ తెలంగాణకు వచ్చినప్పుడల్లా.. సీఎంగా ఉన్న కేసీఆర్ జైలుకుపోవడం ఖాయమని చెప్పడం తప్ప, ఆయనపై మోదీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. కేసీఆర్ పాపాల భైరవుడు అని ధ్వజమెత్తారు. ఎంతో మంది ప్రాణత్యాగం చేస్తే చలించిపోయి సోనియా తెలంగాణ ఇచ్చారని, అలాంటి రాష్ట్రాన్ని దోచుకున్న చరిత్ర కేసీఆర్ దేనని విమర్శించారు.