- ఫలక్నుమా బదులు రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కు ఫేజ్–2
- ప్రజలపై అదనంగా రూ. 2 వేల కోట్లకుపైగా భారం
- ఫలక్నుమా టు ఎయిర్పోర్ట్ వరకు గతంలోనే పూర్తయిన సర్వే
- ఈ రూట్లో డిస్టెన్స్ తక్కువే.. నిర్మాణ ఖర్చూ తక్కువే
- రాయదుర్గం - ఎయిర్పోర్ట్కు 31 కి.మీ.లు.. ఫలక్నుమా - ఎయిర్పోర్ట్కు 16.6 కి.మీ.లే
- అయినా రాయదుర్గం మీదుగా వేయాలని సర్కారు నిర్ణయం.. రేపు సీఎం శంకుస్థాపన
- రియల్ దందా, నేతలకు లాభం చేయడానికే కొత్త రూట్!
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు సెకండ్ ఫేజ్ రూట్ తప్పింది. ప్రజలపై భారం తగ్గించే లాభసాటి దారిలో కాకుండా రాయదుర్గం నుంచి కొత్త లైన్ నిర్మాణానికి రాష్ట్ర సర్కార్ పూనుకుంది. తమ అనుయాయులు, లీడర్ల రియల్ ఎస్టేట్ దందా కోసమే ఈ మార్పును ప్రభుత్వం చేసిందనే విమర్శలు వస్తున్నాయి. ఫలక్నుమా నుంచి ఎయిర్పోర్టు వరకు మెట్రో నిర్మించాలని గతంలో సర్వే కూడా చేశారు. ఈ రూట్లో మెట్రో వల్ల దూరం తగ్గుతుంది.. పైగా నిర్మాణ ఖర్చు కూడా తగ్గుతుంది. కానీ, దీన్ని కాదని ప్రభుత్వం రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కు మెట్రో రూట్ను షిఫ్ట్ చేసింది. ఈ కొత్త రూట్లో మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 6,250 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. అదే ఫలక్నుమా నుంచి చేపడితే రూ. 4వేల కోట్ల వరకు అవుతుంది. అంటే దాదాపు రెండు వేల కోట్ల భారం తగ్గుతుంది. అదేవిధంగా ఎల్బీనగర్ నుంచి ఎయిర్పోర్ట్కు కనెక్టివిటీ చేసినా ఖర్చు తగ్గుతుంది. కానీ.. ప్రభుత్వం రాయదుర్గం రూట్నే ఎంచుకోవడం, కేంద్రంతో పనిలేకుండా తామే చేపడ్తామని చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కొత్త రూట్ పొడవునా టీఆర్ఎస్ లీడర్ల, సన్నిహితుల భూములు ఉన్నాయి. పైగా మొన్నటి వరకు 111 జీవో పరిధిలో ఈ భూములు ఉండేవి. ఇప్పుడు జీవోలోని ఆంక్షలను కూడా ఎత్తేసింది. ఫలితంగా అక్కడ భూములకు గిరాకీ పెరిగింది. ఇప్పుడు మెట్రో వల్ల ఆ ఏరియాలో భూముల ధరలు పదింతలు కానున్నాయి. సెకండ్ ఫేజ్ పనులకు శుక్రవారం సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
రూట్ ఇదే... వాళ్ల ల్యాండ్స్ అక్కడే
ల్యాండ్స్ ధరలను అమాంతం పెంచుకుని రియల్ బూమ్తో సొమ్ము చేసుకోవాలనే ప్లాన్లో భాగంగానే కొత్త మెట్రో రూట్ ఆగమేఘాల మీద పట్టాలు ఎక్కుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాయదుర్గంలో ఎస్ఎఫ్టీ మొన్నటి దాకా రూ.10 వేలు ఉంటే ఇప్పుడు రూ.14 వేలకు ఎగబాకింది. నానక్రాంగూడలో ఏరియాను బట్టి ఎకరం రూ.50 కోట్ల నుంచి రూ.75 కోట్లు ఉంటే ఇప్పుడు ఇది రూ.100 కోట్లు దాటుతున్నది. రాజేంద్రనగర్ రోడ్డు, టీఎస్పీఏ జంక్షన్ ఏరియాలో మినిమమ్ ఎకరా రూ.30 కోట్ల నుంచి రూ.40 కోట్లు ఉంటే.. ఈ నెల కాలంలోనే 60 కోట్లు దాటింది. మెట్రో ప్రాజెక్ట్ పూర్తయితే ఈ రేట్లు పెరుగుతాయి. రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వరకు చేపట్టనున్న మెట్రో కారిడార్లో ఎయిర్పోర్ట్ సమీపంలో 2.5 కి. మీ. అండర్ గ్రౌండ్ మెట్రో నిర్మించనున్నట్లు ప్రభుత్వం చెప్తున్నది. ఈ కారిడర్లో మైండ్ స్పేస్ (రాయదుర్గం), బయోడైవర్సిటీ, గచ్చిబౌలి, ఓఆర్ఆర్ నానక్ రాంగూడ, నార్సింగి, టీఎస్పీఏ, హిమాయత్ సాగర్ , రాజేంద్రనగర్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్ పోర్టు కార్గో, టెర్మినల్ స్టేషన్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. రూట్లో భూములన్నీ 111 జీవో పరిధిలో ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ప్రాంతాల్లోని ఎక్కువ మొత్తంలో ల్యాండ్స్ కొనుగోలు చేసింది కూడా అధికార పార్టీలోని వాళ్లేననే విమర్శలు ఉన్నాయి. అందువల్లే జీవో 111లో ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్లో ప్రభుత్వం 69 జీవో ఇచ్చింది. దీనిపై క్లారిటీ రాకముందు కొత్త రూట్ను సర్కార్ ఎంపిక చేసింది. ప్రభుత్వ పెద్దలకు చెందిన వేల ఎకరాల భూములకు లబ్ధి చేసేలా ప్లాన్ను అమలు చేస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి.
ఓల్డ్ సిటీ వరకు ముందుకు పడలే..
మెట్రోను ఎయిర్పోర్ట్ వరకు విస్తరించాలనే డిమాండ్ చాలా కాలం నుంచే ఉన్నది. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన రాయదుర్గం–ఎయిర్పోర్ట్ రూట్ 31 కిలోమీటర్లు ఉన్నది. మరో రెండు రూట్లలోనూ ఎయిర్పోర్ట్కు మెట్రో విస్తరించే ప్లాన్లు గతంలోనే రెడీ చేశాయి. అందులో ఫలక్నుమా నుంచి ఎయిర్ పోర్ట్ అనే ప్రపోజల్కు సర్వే పూర్తి చేశారు. ఫలక్నుమా నుంచి ఎయిర్ పోర్ట్ వరకు దూరం 16.6 కిలోమీటర్లు వస్తుంది. అంటే.. 14.4 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుంది. జేబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు చేపట్టాల్సిన 15 కి.మీ.పనుల్లో ఎంజీబీఎస్ వరకు పూర్తయ్యాయి. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్ల పనులు పెండింగ్లో ఉన్నాయి. దీనికి గతేడాది, ఈసారి కలిపి బడ్జెట్లో రూ.1,300 కోట్లు కేటాయించినా రూపాయీ రిలీజ్ చేయలేదు. ఇది పూర్తి చేసి.. ఫలక్నుమా నుంచి ఎయిర్పోర్ట్కు మెట్రో చేపడితే ఖర్చు తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. ఎల్బీ నగర్ నుంచి ఎయిర్పోర్ట్కు ప్రాజెక్ట్ చేపడితే ఆ దూరం 23 కిలో మీటర్ల ఉంటుంది. రాయదుర్గంతో చూస్తే ఇది 8 కిలో మీటర్లు తక్కువ. నిర్మాణ ఖర్చు కూడా తక్కువే. పైగా రాయదుర్గం నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ వరకు ఏడాదికి లక్ష మంది వరకే ప్రయాణిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన నెలకు దాదాపు 8,500 మంది..రోజుకు దాదాపు 300 మంది మాత్రమే కొత్త రూట్లో ప్రయాణిస్తారు.
నచ్చిన కాంట్రాక్టర్లకు కట్టబెట్టుడే!
ప్రస్తుతం మెట్రో నిర్మించాలంటే కిలో మీటర్కు రూ.250 కోట్లు ఖర్చవుతుంది. రాయదుర్గం–ఎయిర్పోర్ట్ రూట్ ఖర్చు రూ.6 వేల కోట్లు దాటుతున్నది. దూరం పెరగడంతోనే ఇంత మేర వ్యయం అవుతున్నది. అదే ఫలక్నుమా, ఎల్బీ నగర్లో ఏ రూట్ నుంచి మొదలు పెట్టినా సగం కంటే తక్కువ ఖర్చు అవడమే కాకుండా దూరం కూడా తగ్గుతుంది. కాంట్రాక్టు ఏజెన్సీలను నియమించేందుకు ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) ఇప్పటికే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్(ఈవోఐ) ప్రభుత్వం ఆహ్వానించింది. బిడ్ల దాఖలుకు ఈ నెల 13 చివరి తేదీగా నిర్ణయించారు. ప్రస్తుత మెట్రో కారిడార్లను ఎల్అండ్ టీ నిర్మించింది. ఈ సంస్థ ఇప్పుడు నష్టాల్లో ఉంది. దీంతో ఎల్ అండ్టీ ముందుకు వస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎల్అండ్టీ కాకుండా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిన కంపెనీలకు కొత్త మెట్రో కారిడార్ను కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ ఎల్ అండ్టీకి ఇచ్చినా.. సబ్ కాంట్రాక్ట్ల పేరుతోనూ తమవారికే అవకాశం ఇవ్వాలనే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిసింది.
రిపోర్ట్ లేదాయె.. అప్పే దిక్కాయె
మెట్రో రైల్ ప్రాజెక్ట్ డీపీఆర్లో కొన్ని అంశాలు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. ఇందులో టెక్నికల్ రిపోర్ట్, ఫీజిబిలిటీ రిపోర్ట్ , ఎకనామిక్ అండ్ సోషల్ కాస్ట్ బెనిఫిట్స్, ఫైనాన్షియల్ అనాలసిస్, సోషల్ వయబిలిటీ వంటివి ఉంటాయి. వీటి వివరాలేవీ పూర్తిగా చెప్పకుండానే రాష్ట్ర ప్రభుత్వం కొత్త మెట్రో కారిడర్కు శంకుస్థాపన చేస్తున్నది. పైగా ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ సాయం కోరితే.. అడిగిన అన్ని రిపోర్టులు ఇవ్వాల్సి వస్తుందని, ఎక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంటే బాగుంటుందనే ప్రతిపాదన కూడా వస్తుందన్న ఉద్దేశంతోనే రాష్ట్ర సర్కారు సొంత రూట్లో వెళ్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఎండీఏ, హెచ్ఎంఆర్ఎల్, టీఎస్ఐఐసీ సంస్థలు కలిసి ఈ ప్రాజెక్టుకు నిధులు సర్దుబాటు చేస్తాయని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. దీంతో అప్పులు తెచ్చే ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయనున్నారు. ఆ రూట్లో ప్రయాణించే ప్యాసింజర్ల నుంచి వసూలు చేసి కడుతామనే కన్సెంట్, సర్కార్ గ్యారంటీతో అప్పులు తీసుకోనున్నట్లు తెలిసింది.