
- 50 బహిరంగ సభలు, రోడ్ షోల్లో పాల్గొనేలా రేవంత్ ప్లాన్
- మోదీ, అమిత్ షా, ఇతర జాతీయ నేతలతో బీజేపీ క్యాంపెయిన్
- డబుల్ డిజిట్సీట్ల కోసం కమలం ప్రయత్నం
- బస్సు యాత్రలతో జనంలోకి కేసీఆర్..
హైదరాబాద్, వెలుగు: లోక్సభ ఎన్నికలకు నామినేషన్లు ముగియడంతో ఇక అన్ని పార్టీలు ప్రచార జోరు పెంచనున్నాయి. పోలింగ్కు మరో 18 రోజులే ఉండడంతో రోడ్ షోలు, బహిరంగ సభలు, డోర్ టు డోర్ క్యాంపెయిన్లకు ప్లాన్ చేసుకుంటున్నాయి. సెకండ్ క్యాడర్ నాయకులను ప్రచారంలోకి దింపుతున్నాయి. ఈ సారి లోక్సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలవాలని కాంగ్రెస్ టార్గెట్గా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులను సీఎం రేవంత్ సమాయత్తం చేశారు. దీంతో పార్టీ క్యాడర్ మొత్తం ప్రచారంలో మునిగిపోయింది. బీజేపీ కూడా10 నుంచి 12 సీట్లు సాధించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నది. గత ఎన్నికల్లో నాలుగు సీట్లు సాధించిన ఆ పార్టీ ఈ సారి డబుల్ డిజిట్పై కన్నేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి దెబ్బతిన్న బీఆర్ఎస్.. తిరిగి ఉనికి చాటుకునేందుకు ఎదురీదుతున్నది. నిన్నా మొన్నటి వరకు సీన్లో లేని ఆ పార్టీ.. కేసీఆర్బస్సు యాత్రతో ఊపు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. 8 నుంచి 10 సీట్లు సాధిస్తామని ఆ పార్టీ నేతలు సభలు, సమావేశాల్లో ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మోదీ సభలు, అమిత్ షా టూర్లు..
జాతీయ నేతలతో బీజేపీ తన క్యాంపెయిన్ను ప్లాన్ చేసుకుంది. 21 రోజుల కార్యాచరణ రూపొందించుకున్న ఆ పార్టీ ఇప్పటికే కొన్ని సభలు నిర్వహించింది. పోలింగ్ నాటికి రాష్ట్రానికి మోదీ ఐదారు సార్లు వచ్చిపోయేలా ప్లాన్ చేసుకుంది. హోం మంత్రి అమిత్ షా కూడా సమయం చిక్కినప్పుడల్లా రాష్ట్రానికి వచ్చి పోతున్నారు. బీఆర్ఎస్ వల్ల ఏర్పడిన గ్యాప్లోకి దూసుకెళ్లాలని రాష్ట్ర నేతలకు జాతీయ నాయకులు దిశానిర్దేశం చేస్తున్నారు. అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియలో కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో ప్రచారానికి కూడా వాళ్లు హాజరయ్యేలా బీజేపీ నేతలు షెడ్యూల్ రూపొందించారు.
కేసీఆర్ బస్సు యాత్రను నమ్ముకున్న బీఆర్ఎస్
కేసీఆర్ బస్సు యాత్రలనే బీఆర్ఎస్పూర్తిగా నమ్ముకుంది. మూడు రోజుల క్రితం కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభమైంది. రోజుకు రెండు చోట్ల రోడ్ షో ఉండేలా ఆయన పర్యటనను రూపొందించారు. 17 రోజుల్లో 21 రోడ్ షోల్లో కేసీఆర్ పాల్గొంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. మిర్యాలగూడలో ప్రారంభమైన ఆయన రోడ్ షోలు మే 10 వరకు కొనసాగుతాయి. సిద్దిపేటలో జరిగే బహిరంగ సభతో కేసీఆర్ టూర్ ముగియనుంది. మాజీ మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ కూడా ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి గెలుపు అవకాశాలను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ప్రచారంలో కాంగ్రెస్ ముందంజ
రాష్ట్రంలో అన్ని పార్టీల కన్నా ప్రచారంలో కాంగ్రెస్ముందుంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి ప్రచారాన్ని ఉధృతం చేశారు. వారం క్రితం ప్రచారం మొదలుపెట్టిన ఆయన.. ప్రతి రోజు ఏదో ఒక చోట సభ, రోడ్షోలు ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. ఎండలను సైతం లెక్క చేయకుండా ప్రచారం సాగిస్తున్నారు. పోలింగ్నాటికి సభలు, రోడ్షోలు కలిపి 60 నుంచి 70 వరకు ఉండేలా ప్లాన్ చేశారు. వీలున్న చోట కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేసి ప్రసంగిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం వేళల్లో రోడ్ షోలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సాయంత్రం జనజాతర సభల్లో పాల్గొంటున్నారు. ఒకవైపు స్వయంగా ప్రచారంలో పాల్గొంటూనే మరో వైపు ఇతర నేతలు ఆయా నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొనేలా దిశానిర్దేశం చేస్తున్నారు. క్షేత్ర స్థాయి నుంచి సర్వే రిపోర్టులు తెప్పించుకొని సూచనలు చేస్తున్నారు. ఎక్కడైనా అభ్యర్థి ప్రచారంలో వీక్గా ఉన్నట్లు అనిపిస్తే ముఖ్య నేతలను పురమాయిస్తున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు ఇతర నేతలతో కలిసి బూత్ కమిటీలు వేసి ఇంటింటి ప్రచారం చేయాలని రేవంత్ ఇప్పటికే సూచించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఈ తరహా ప్రచారం కొనసాగుతున్నది.