
బెంగళూరు: బ్యాటింగ్లో మ్యాక్స్వెల్ (44 బాల్స్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 77), డుప్లెసిస్ (39 బాల్స్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 62) దంచికొట్టడంతో.. ఐపీఎల్–16లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో విక్టరీని ఖాతాలో వేసుకుంది. బౌలింగ్లో హర్షల్ పటేల్ (3/32) చెలరేగడంతో.. ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 7 రన్స్ తేడాతో రాజస్తాన్ రాయల్స్ను నిలువరించింది. టాస్ ఓడిన బెంగళూరు 20 ఓవర్లలో 189/9 స్కోరు చేసింది. తర్వాత రాజస్తాన్ 20 ఓవర్లలో 182/6 స్కోరుకే పరిమితమైంది. దేవదుత్ పడిక్కల్ (34 బాల్స్లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 52), యశస్వి జైస్వాల్ (37 బాల్స్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 47), ధ్రువ్ జురెల్ (16 బాల్స్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 34 నాటౌట్) చివరి వరకు పోరాడారు. మ్యాక్స్వెల్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
సెంచరీ స్టాండ్
ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ ఫస్ట్ బాల్కే కోహ్లీ (0) వికెట్ను కోల్పోయింది. అద్భుతమైన ఇన్స్వింగర్తో బౌల్ట్ (2/41) విరాట్ను ఎల్బీ చేయగా, థర్డ్ ఓవర్లో షాబాజ్ అహ్మద్ (2)ను దెబ్బకొట్టాడు. దీంతో 12/2తో కష్టాల్లో పడ్డ బెంగళూరు ఇన్నింగ్స్ను డుప్లెసిస్, మ్యాక్స్వెల్ సూపర్ ఆటతో ఆదుకున్నారు. పవర్ప్లేలో 62/2 స్కోరుతో ఇన్నింగ్స్లో స్థిరత్వం తెచ్చిన ఈ ద్వయం తర్వాత చెలరేగింది. దాదాపు 11 ఓవర్ల పాటు క్రీజులో ఉన్న ఈ ఇద్దరు పంజాబ్ బౌలర్లను సిక్స్లు, ఫోర్లతో ఉతికి ఆరేశారు. ఈ క్రమంలో మూడో వికెట్కు 127 రన్స్ జోడించి భారీ స్కోరుకు బాటలు వేశారు. కానీ 14వ ఓవర్లో యశస్వి డైరెక్ట్ త్రోకు డుప్లెసిస్ రనౌట్ అయ్యాడు. 27 బాల్స్లోనే ఫిఫ్టీ మార్క్ అందుకున్న మ్యాక్స్వెల్ను తర్వాతి ఓవర్లో అశ్విన్ (1/36) ఔట్ చేయడంతో ఆర్సీబీ ఇన్నింగ్స్పై ప్రభావం చూపింది. చివరి ఐదు ఓవర్లలో రాయల్స్ బౌలర్లు రన్స్ను కట్టడి చేశారు. దీంతో ఆర్సీబీ 50 రన్స్ తేడాతో 7 వికెట్లు చేజార్చుకుంది. ఫలితంగా 139/2తో పటిష్టంగా కనిపించిన స్కోరు బోర్డు 189/9గా మారింది. మహిపాల్ (8), దినేశ్ కార్తీక్ (16), సుయాంశ్ (0), వానిందు హసరంగ (6), డేవిడ్ విల్లే (4 నాటౌట్), విజయ్ కుమార్ (0) నిరాశపర్చారు.
పడిక్కల్, యశస్వి పోరాటం
టార్గెట్ ఛేజింగ్లో రాజస్తాన్ కూడా దీటుగానే పోరాడింది. ఇన్నింగ్స్ నాలుగో బాల్కు బట్లర్ (0) డకౌటైనా, యశస్వి, పడిక్కల్.. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపెట్టారు. ఓవర్కు ఒకటి, రెండు ఫోర్లు బాదడంతో పవర్ప్లేలో 47/1 స్కోరు వచ్చింది. తర్వాత కూడా ఈ ఇద్దరు స్వేచ్ఛగా షాట్లు కొట్టడంతో 10 ఓవర్ల పాటు వికెట్ను తీయలేకపోయారు. అయితే 12వ ఓవర్ నుంచి ఆర్సీబీ బౌలర్లు పట్టుబిగించారు. ఈ ఓవర్లో సిరాజ్ (1/39) పడిక్కల్ను ఔట్ చేయడంతో రెండో వికెట్కు 98 రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయ్యింది. ఇక్కడి నుంచి హర్షల్ పటేల్ ప్రభావం చూపాడు. 14వ ఓవర్లో యశస్విని, 16వ ఓవర్లో శాంసన్ (22)ను పెవిలియన్కు పంపాడు. ధ్రువ్ జురెల్ బాగా ఆడినా, 18వ ఓవర్లో హెట్మయర్ (3) రనౌట్ మ్యాచ్ను మలుపు తిప్పింది. 155/5తో కష్టాల్లో పడిన ఇన్నింగ్స్ను జురెల్, అశ్విన్ (12) గట్టెక్కించే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరు ఆరో వికెట్కు 25 రన్స్ జోడించి విజయానికి దగ్గరగా తీసుకొచ్చారు. లాస్ట్ ఓవర్లో 20 రన్స్ అవసరంకాగా, తొలి మూడు బాల్స్కు 10 రన్స్ రాబట్టిన అశ్విన్ను నాలుగో బాల్కు పటేల్ వెనక్కి పంపాడు. చివరి రెండు బాల్స్లో మిగతా 10 రన్స్ చేయడంలో జురెల్, అబ్దుల్ బాసిత్ (1 నాటౌట్) ఫెయిలయ్యారు.