న్యూఢిల్లీ: కరోనా ట్రీట్మెంట్ కోసం ఉపయోగించే రష్యన్ వ్యాక్సిన్ స్పుత్నిక్ వీని ఇండియాలో తయారు చేయడాన్ని మొదలుపెట్టామని పానసియా బయోటెక్, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) ప్రకటించాయి. హిమాచల్ప్రదేశ్లోని బద్దిలోగల తమ ప్లాంటులో వీటిని తయారు చేసిన అనంతరం.. మాస్కోలోని గమలేయా సెంటర్కు క్వాలిటీ కంట్రోల్ టెస్టుల కోసం పంపుతామని పానసియా వెల్లడించింది. తమ ప్లాంట్లన్నీ జీఎంపీ, డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్స్కు అనుగుణంగా ఉన్నాయని తెలిపింది. కరోనాకు వ్యతిరేకంగా మనదేశం చేస్తున్న పోరాటంలో స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారీ ఒక ముందడుగు అని కంపెనీ ఎండీ డాక్టర్ రాజేశ్ జైన్ అన్నారు. స్పుత్నిక్ ద్వారా దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆర్డీఐఎఫ్ సీఈఓ కిరిల్ దిమిత్రివ్ అన్నారు. ఇండియాలో వ్యాక్సినేషన్ పూర్తయ్యాక, ఇక్కడి నుంచే ఇతర దేశాలకు ఎగుమతులూ చేస్తామని ప్రకటించారు. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వాడకానికి కేంద్ర ప్రభుత్వం గత నెల 12న పర్మిషన్లు ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల మందికి తమ వ్యాక్సిన్ వేయడానికి అనుమతులు ఉన్నాయని పేర్కొంది. మనదేశంలో ఇది వరకే భారత్ బయోటెక్ కోవాగ్జిక్, ఆక్సఫర్డ్- ఆస్ట్రాజెనికా కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు పర్మిషన్లు ఉన్నాయి. స్పుత్నిక్ వ్యాక్సిన్ మూడోది. అయితే ఇతర వ్యాక్సిన్ల వల్ల కొన్ని అలెర్జీలు వస్తాయని, స్పుత్నిక్తో అలాంటి ఇబ్బందులేవీ రావని ఆర్టీఐఎఫ్ తెలిపింది. ఇండియాతోపాటు అర్జెంటీనా, బొలీవియా, హంగరీ, యూఏఈ, ఇరాన్, మెక్సికో, పాకిస్తాన్, బహ్రెయిన్, శ్రీలంక వంటి 60 తదితర దేశాలు స్పుత్నిక్కు పర్మిషన్లు ఇచ్చాయి.
ఎఫికసీ 91.6 శాతం..
స్పుత్నిక్ను -2 డిగ్రీల నుంచి -8 డిగ్రీల టెంపరేచర్తో నిల్వ చేయాలి. వ్యాక్సిన్ ఎఫికసీ 91.6 శాతం ఉంటుందని మెడికల్ జర్నల్ లాన్సెట్ ఇది వరకే ప్రకటించింది. ఈ వ్యాక్సిన్ను రష్యా బయట అత్యధికంగా తయారు చేస్తున్న దేశాల్లో ఇండియా కూడా ఒకటి. ఇండియాలో వ్యాక్సిన్ తయారీకి ఆర్డీఐఎఫ్ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ సహా పలు ఫార్మా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. హెటెరో, గ్లాండ్ ఫార్మా, స్టెలిస్ ఫార్మా, విక్రో బయోటెక్లు కూడా వ్యాక్సిన్ తయారీ కోసం ఆర్డీఐఎఫ్తతో చేతులు కలిపాయి. ఈ వ్యాక్సిన్ను రెండు డోసుల్లో ఇస్తారు. మొదటి డోసు తీసుకున్న 21 రోజుల తరువాత రెండోది ఇస్తారు.