
ఇంఫాల్ : మణిపూర్లో తిరుగుబాటుదారులపై బీరేన్ సింగ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఆదివారం (మే 28న) ఒక్క రోజే 40 మందిని హతమార్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తిరుగుబాటుదారులను మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ ఉగ్రవాదులతో పోల్చారు. ‘‘ సాధారణ పౌరులపై M-16, AK-47, స్నైపర్ గన్లతో ఉగ్రవాదులు దాడికి దిగుతున్నారు. గ్రామాల్లోకి వెళ్లి ఇండ్లకు నిప్పు పెడుతున్నారు. ఇండియన్ ఆర్మీ, ఇతర భద్రతాబలగాల సాయంతో వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 40 మంది ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి’’ అని ఎన్. బీరేన్ సింగ్ మీడియాకు తెలిపారు.
ఆందోళనకారులను కుకీ మిలిటెంట్లుగా పరిగణించలేమని మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ చెప్పారు. మే 28న రాత్రి 2 గంటల సమయంలో ఇంఫాల్ లోయలోని సేక్మయి, సుంగు, ఫయేంగ్, సెరయు ప్రాంతాల్లో తిరుగుబాటువాదులు కాల్పులకు పాల్పడ్డారని, దీంతో అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయని వెల్లడించారు.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ఆందోళనలు, నిరసనలతో గత కొన్ని రోజులుగా అట్టుడుకుతోంది. ఎస్టీ హోదా కోసం మెయిటీలు చేసిన డిమాండ్కు మణిపూర్ వ్యాలీ ప్రాంతానికి చెందిన చట్టసభ్యుల నుంచి మద్దతు లభించింది. దీంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇది ఘర్షణకు దారితీసింది. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మెయిటీ వర్గానికి చెందినవారే. మణిపూర్ వ్యాలీలో వారి ప్రాబల్యం ఎక్కువ. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వస్తోన్న అక్రమ వలసదారులతో తాము సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మణిపూర్ లోని పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి.