V6 News

మంజీరా బ్యారేజీ నుంచి నీటి విడుదల 

మంజీరా బ్యారేజీ నుంచి నీటి విడుదల 

మెదక్, కొల్చారం, వెలుగు: సింగూర్​ ప్రాజెక్ట్​ నీటి విడుదలకు అడ్డంకులు తొలగిపోయాయి. ఎట్టకేలకు మంజీరా బ్యారేజ్ నుంచి నీరు విడుదల కాగా, మంగళవారం రాత్రి వరకు ఘనపూర్ ఆనకట్టకు చేరనున్నాయి. దీంతో వేలాది మంది ఆయకట్టు రైతులకు ఊరట లభించింది. మెదక్​ జిల్లాలోని ఘనపూర్​ ఆనకట్ట కింద, మంజీరా నది పరివాహక ప్రాంతంలో యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌లో సుమారు 20 వేల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారు. అయితే ఆనకట్టలో నీరు   అడుగంటడం, బోర్లలో నీటిమట్టాలు తగ్గిపోవడంతో చాలాచోట్ల నీటి తడులు అందక పంటలు ఎండిపోతున్నాయి.  

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్​రెడ్డి ఆధ్వర్యంలో రైతులు హెచ్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీని ఆశ్రయించారు. కాంగ్రెస్​ పార్టీ కొల్చారం మండల నాయకులు ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ మంత్రి ఉత్తమ్‌‌‌‌‌‌‌‌ను కలిసి పంటలను కాపాడేందుకు సింగూర్​ నుంచి  0.3 టీఎంసీ నీటిని విడుదల చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఇరిగేషన్​ అధికారులు గత శనివారం సంగారెడ్డి జిల్లా పరిధిలోని సింగూర్​ ప్రాజెక్ట్​ గేట్ ఎత్తి నీటిని విడుదల చేశారు. అయితే సింగూర్​ ప్రాజెక్ట్​ దిగువన ఉన్న మంజీరా బ్యారేజీ వద్ద హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ మెట్రో వాటర్​ సప్లై అండ్ సీవరేజ్​ బోర్డు అధికారులు నీటిని ఆపేయడంతో నీరు దిగువకు రాలేదు.

దీంతో నీరు రాకుంటే పంటలు ఎండిపోతాయని ఘనపూర్​ ఆయకట్టు రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో నర్సాపూర్​ ఎమ్మెల్యే  సునీతా లక్ష్మారెడ్డి ఆదివారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఘనపూర్​ ఆయకట్టు రైతుల అవసరాల కోసం సింగూర్​ ప్రాజెక్ట్​ నుంచి నీటిని విడుదల చేసినప్పటికి మంజీరా బ్యారేజీ వద్ద ఆపేయడంతో నీరు ఘనపూర్​ ఆనకట్టకు చేరడం లేదని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ క్రమంలో ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ సంగారెడ్డి సర్కిల్​ సూపరింటెండెంట్​ ఇంజినీర్​(ఎస్​ఈ) సూచన మేరకు మంజీరా బ్యారేజీ నుంచి 0.3 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేస్తూ హైదరాబాద్​ మెట్రో వాటర్​ సప్లై అండ్ సీవరేజ్​ బోర్డు  జీఎం రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం రాత్రి మంజీరా బ్యారేజీ నుంచి నీటిని దిగువకు విడుదల  చేయగా ఆ నీరు మంగళవారం రాత్రి వరకు ఘనపూర్​ ఆనకట్టకు చేరే అవకాశం ఉంది.

.నీరు ఇక్కడికి చేరాక గేట్లు ఎత్తి మహబూబ్​ నహర్​, ఫతేనహర్​ కాల్వలకు విడుదల చేస్తారు. సింగూర్​ నీటి రాకతో ఘనపూర్​ ఆయకట్టు రైతులతోపాటు, చిలప్​ చెడ్, కొల్చారం, పాపన్నపేట మండలాల పరిధిలో మంజీరా పరివాహక ప్రాంతంలో పంటలు సాగు చేసిన రైతులకు మేలు కలుగనుంది.