రాడ్ తొలగించి.. వాచర్ వదిలేసిండు.. ప్రైవేట్​ డాక్టర్​ నిర్లక్ష్యం

రాడ్ తొలగించి.. వాచర్ వదిలేసిండు.. ప్రైవేట్​ డాక్టర్​ నిర్లక్ష్యం
  • నెలరోజులుగా తీవ్ర ఇబ్బంది పడుతున్న బాధితురాలు

భైంసా, వెలుగు :  నిర్మల్​జిల్లా భైంసాకు చెందిన ప్రైవేట్​డాక్టర్ నిర్లక్ష్యంగా ట్రీట్​మెంట్ ​చేయడంతో, ఓ మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. కాలులో వేసిన రాడ్​ను తొలగించి.. వాచర్​ను అలాగే వదిలేయడంతో ఇన్ఫెక్షన్ ​పెరిగిపోయింది. బాధితురాలు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. భైంసాలోని రాహుల్​నగర్ కు చెందిన లావణ్య(40) ఏడాది కింద మెట్లు దిగుతూ జారిపడింది. ఆమె ఎడమ కాలు విరగడంతో కుటుంబ సభ్యులు ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ ​చేయించారు. కొద్దిరోజుల కింద లావణ్య స్థానిక వెంకటేశ్వర హాస్పిటల్ కాలు చెకప్​చేయించుకోగా, డాక్టర్ ​శ్రీకాంత్ పరీక్షించి రాడ్​తొలగించాలని చెప్పారు. తర్వాత ఆపరేషన్​ చేసి, రాడ్​తొలగించారు. అయితే అంతకు ముందు రాడ్​తోపాటు వేసిన వాచర్​ను డాక్టర్ ​శ్రీకాంత్ కాలులోనే వదిలేశారు.

ఇటీవల రాడ్​తొలగించిన భాగంలో వాపు రావడంతోపాటు చీము కారడం మొదలైంది. ఆందోళన చెందిన బాధితురాలు నిజామాబాద్ లోని ఓ ప్రైవేట్​హాస్పిటల్​లో టెస్టులు చేయించుకోగా,  కాలులో వాచర్ ​వదిలేయడంతో ఇన్ఫెక్షన్​పెరిగిపోయిందని డాక్టర్లు చెప్పారు. వెంటనే ఆపరేషన్​చేసి వాచర్​తొలగించారు. ఈ విషయమై డా.శ్రీకాంత్ ను అడిగితే నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారని, లావణ్య భర్త విఠల్ ఆరోపించారు. డా.శ్రీకాంత్ ను ‘వెలుగు’ ప్రతినిధి వివరణ కోరగా.. అవసరం లేకుంటేనే వాచర్​ను తొలగిస్తామని చెప్పారు. పేషెంట్ కుటుంబ సభ్యులు కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.