- క్యాంపుల్లో పెట్టి కాపలా కాస్తున్నారు
- సర్కారుకు రైతుల ఉసురు తగులతది
- బీజేపీ లీడర్ బాబూమోహన్
జోగిపేట, వెలుగు: సొంతపార్టీ ప్రజాప్రతినిధులే టీఆర్ఎస్కు ఎదురుతిరుగుతున్నారని, వాళ్లను కాపాడుకునేందుకు క్యాంపులకు తరలించి కాపలా కాస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి బాబూమోహన్ అన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. మెదక్ లోకల్బాడీ ఎమ్మెల్సీ పరిధిలో టీఆర్ఎస్కు మెజారిటీ ఉన్నా క్యాంపులకు తరలించడమంటే వారిమీద నమ్మకం లేనట్టేనని అన్నారు. టీఆర్ఎస్ టికెట్ మీద గెలిచిన నేతలే ఆ పార్టీని నమ్మడం లేదంటే ప్రజలు, రైతులు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. అసంతృప్తివాదులంతా బీజేపీకి ఓటేస్తామని.. క్యాండిడేట్ను నిలబెట్టాలని సూచించారని, కానీ అధిష్టానం నిర్ణయం మేరకు పోటీకి దూరంగా ఉన్నట్టు చెప్పారు. వడ్ల కొనుగోలుకు సంబంధించి కేంద్రం పాలసీ క్లియర్గా ఉందని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం బురద జల్లుతోందని మండిపడ్డారు. హుజూరాబాద్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రభుత్వం రైతులను వేధిస్తోందని, రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న టీఆర్ఎస్కు వారి ఉసురు తగులుతుందన్నారు. కేసీఆర్, ఆయన టీం మాట్లాడే భాష అనాగరికులు కూడా వాడరని అన్నారు. ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. వరి వేయొద్దంటున్న కేసీఆర్ లక్షల కోట్లు ఖర్చుపెట్టి ప్రాజెక్టులు ఎందుకు కట్టారని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీజేపీ లీడర్లు సయ్య సాయి, ఆనంద్ శర్మ, సుమన్, అర్జున్, రాకేష్ పాల్గొన్నారు.