సొరంగంలో 40 ప్రాణాలు!

సొరంగంలో  40 ప్రాణాలు!
  • సొరంగంలో  40 ప్రాణాలు! 
  • ఉత్తరాఖండ్‌‌లో కూలిన టన్నెల్.. రెండ్రోజులుగా లోపలే కార్మికులు
  • అందరూ సురక్షితం.. పైప్‌‌లైన్ ద్వారా ఆక్సిజన్, ఆహారం, నీరు
  • నిరంతరం కూలుతూనే ఉన్న మట్టి.. రెస్క్యూ చర్యలకు ఆటంకం
  • రేపటి లోపు అందరినీ బయటికి తీసుకొచ్చేందుకు చర్యలు

ఉత్తరకాశీ/డెహ్రాడూన్:  శిథిలాలకు అవతల 40 ప్రాణాలు.. గంటలు గడుస్తున్న కొద్దీ గుండెలు అదురుతున్నయి.. వాళ్లకు ఏమైందో? ఎలా ఉన్నారో? అనే ఆందోళన.. క్షణం తీరిక లేకుండా రెస్క్యూ సిబ్బంది పని చేస్తున్నారు.. ఎట్టకేలకు అటువైపు నుంచి సిగ్నల్ వచ్చింది.. ఉత్కంఠ వీడింది.. కార్మికులు బతికే ఉన్నారని తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరాఖండ్‌‌లో నిర్మాణంలో ఉన్న టన్నెల్‌‌ కూలిన ఘటనలో.. లోపల చిక్కుకున్న కార్మికులందరూ క్షేమంగా ఉన్నారు. వారితో మాట్లాడుతూ, ఆక్సిజన్, ఆహారం, నీళ్లు పంపిస్తున్న అధికారులు.. వీలైనంత త్వరగా, సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మట్టి కూలుతూనే ఉండటంతో.. ఈ రెస్క్యూ ఆపరేషన్ బుధవారం దాకా కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు.  సోమవారం ఘటనా స్థలికి సీఎం పుష్కర్ సింగ్ ధామీ చేరుకుని.. 
రెస్క్యూ ఆపరేషన్‌‌ను పరిశీలించారు.

30 మీటర్ల పరిధిలో మట్టి..

చార్‌‌‌‌ధామ్‌‌ ప్రాజెక్టులో భాగంగా బ్రహ్మకాల్ యమునోత్రి నేషనల్ హైవేపై సిల్క్యారా, దండల్గావ్ మధ్య టన్నెల్ నిర్మిస్తున్నారు. నేషనల్ హైవేస్, ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌‌హెచ్‌‌ఐడీసీఎల్) ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. అయితే ఆదివారం ఉదయం టన్నెల్‌‌లో కొంత భాగం కూలింది. 30 మీటర్ల పరిధిలో మట్టి కప్పేసింది. దీంతో కార్మికులకు బయటి ప్రపంచంతో సంబంధాలు కట్ అయిపోయాయి. వెంటనే సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌‌డీఆర్ఎఫ్, ఐటీబీపీ, బీఆర్‌‌‌‌వో అధికారులు, సిబ్బంది సహాయక చర్యల్లోకి దిగారు.

స్టీల్‌‌ పైప్‌‌ ద్వారా రప్పించేలా..

టన్నెల్‌‌ పైనున్న మట్టి లూజ్‌‌గా ఉండటంతో నిరంతరం కూలుతూనే ఉన్నది. దీంతో రెస్క్యూ ఆపరేషన్ ముందుకు సాగట్లేదు. ఈ నేపథ్యంలో కార్మికులను కాపాడేందుకు పెద్ద స్టీల్‌‌ పైప్‌‌ను ఉపయోగించాలని అధికారులు భావిస్తున్నారు. ‘టన్నెల్‌‌లో లూజ్‌‌గా ఉన్న మట్టి కూలుతుండటంతో వెనువెంటనే తొలగిస్తున్నాం. మళ్లీ కూలకుండా కాంక్రీట్‌‌ను స్ప్రే చేస్తున్నాం (షాట్‌‌క్రీటింగ్). హైడ్రాలిక్ జాక్ సాయంతో 900 ఎంఎం వ్యాసం ఉన్న స్టీల్‌‌ పైప్‌‌ను శిథిలాల నుంచి అవతలి వైపునకు పంపి కార్మికులను రప్పించాలని ప్లాన్ చేస్తున్నాం’ అని ఎన్‌‌హెచ్‌‌ఐడీసీఎల్ తెలిపింది. హరిద్వార్ నుంచి మైల్డ్ స్టీల్‌‌ పైప్‌‌ను తీసుకొచ్చినట్లు వివరించింది. వీరికి సాయంగా ఇరిగేషన్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌కు చెందిన నిపుణుల బృందం కూడా వస్తోందని పేర్కొంది.

రేపటి దాకా ఆపరేషన్!

మంగళవారం రాత్రికి లేదా బుధవారానికి వారిని బయటికి తీసుకురాగలమని డిజాస్టర్ మేనేజ్‌‌మెంట్ సెక్రటరీ రంజిత్ కుమార్ సిన్హా చెప్పారు. ‘‘15 నుంచి 20 మీటర్ల మేర శిథిలాలను తొలగించాం. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నది. ఒక రంధ్రం చేసి.. స్టీల్‌‌ పైపును శిథిలాల గుండా పంపాలని ప్లాన్ చేశాం. మంగళవారం రాత్రికి లేదా బుధవారానికి అందరినీ బయటికి తీసుకురాగలమని ఆశిస్తున్నాం’’ డిజాస్టర్ మేనేజ్‌‌మెంట్ సెక్రటరీ రంజిత్ కుమార్ సిన్హా చెప్పారు. జిల్లా ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ రిలీజ్ చేసిన లిస్టు ప్రకారం.. చిక్కుకున్న కూలీల్లో జార్ఖండ్‌‌ (15 మంది), యూపీ(8 మంది), ఒడిశా(ఐదుగురు), బీహార్‌‌ (నలుగురు), బెంగాల్‌‌ (ముగ్గురు), యూపీ(ఇద్దరు), అస్సాం(ఇద్దరు), హిమా చల్‌‌ ప్రదేశ్‌‌ (ఒకరు) వారు ఉన్నారు.

నిరంతరం మాట్లాడుతూ.. అన్నీ సరఫరా చేస్తూ..

రెస్క్యూ సిబ్బంది పని స్టార్ట్ చేసిన వెంటనే.. ముందుగా ఆక్సిజన్‌‌ను లోపలికి సరఫరా చేయడం ప్రారంభించారు. ఇందుకోసం ఆదివారం రాత్రంతా విశ్రాంతి లేకుండా పనిచేశారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో తొలుత కార్మికులతో వైర్‌‌‌‌లెస్‌‌ ద్వారా కమ్యూనికేట్ అయినట్లు సర్కిల్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్ చెప్పారు. ఆ పైన తాగు నీటిని, కొద్దిపాటి ఆహారాన్ని సరఫరా చేయడానికి మార్గం ఏర్పాటు చేశారు. 

అధికారులు ఎప్పటికప్పుడు వాకీటాకీలో కార్మికులతో మాట్లాడారు. ఆహారం, నీరు, ఆక్సిజన్, ఎలక్ట్రిసిటీని సరఫరా చేస్తున్నారు. తాము సురక్షితంగా ఉన్నామని వర్కర్లు చెబుతున్నారని ఎన్‌‌హెచ్‌‌ఐడీసీఎల్ తెలిపింది. ‘‘అందరూ సేఫ్‌‌గానే ఉన్నారు. అందరినీ సేఫ్​గా తీసుకొచ్చేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నాం. మాకు ప్లాన్ ఏ, ప్లాన్ బీ, ప్లాన్ సీ కూడా ఉన్నాయి. పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగుతున్నాం” అని ఎన్‌‌హెచ్‌‌ఐడీసీఎల్ డైరెక్టర్ అన్షు మనీశ్ ఖాల్కో తెలిపారు.