మేడారంలో రేవంత్ పాదయాత్ర ప్రారంభం: మల్లు రవి 

మేడారంలో రేవంత్ పాదయాత్ర ప్రారంభం: మల్లు రవి 
  • తొలి విడతలో 50 నుంచి 60 కి.మీ 

హైదరాబాద్, వెలుగు: ‘‘హాత్​సే హాత్​జోడో’’ యాత్రలో భాగంగా ఈ నెల 6 నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర ఉంటుందని పీసీసీ సీనియర్​వైస్​ప్రెసిడెంట్ మల్లు రవి చెప్పారు. ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క, సారలమ్మ దర్శనం చేసుకొని యాత్రను ప్రారంభిస్తారని తెలిపారు. తొలి విడతలో 50 నుంచి 60 కిలోమీటర్ల వరకు నడుస్తారని, అన్ని జిల్లాల్లోనూ పాదయాత్ర ఉంటుందని చెప్పారు. భారత్​జోడో యాత్రలో రాహుల్​గాంధీతో పాటు నడిచిన పార్టీ నాయకులు బెల్లయ్య నాయక్, కేతూరి వెంకటేశ్ లకు గురువారం గాంధీభవన్​లో సన్మానం చేశారు. ఈ సందర్భంగా మల్లు రవి మీడియాతో మాట్లాడారు. జోడో యాత్రలో రాష్ట్రం నుంచి 10 మంది చివరిదాకా రాహుల్​తో కలిసి నడిచారని ఆయన తెలిపారు. తాను కూడా బెల్లయ్య నాయక్​ను ఆదర్శంగా తీసుకొని రేవంత్​తో కలిసి నడుస్తానని చెప్పారు.

‘‘రేవంత్​పాదయాత్రను మొదట భద్రాచలం నుంచి ప్రారంభించాలని అనుకున్నం. కానీ ఆ రోజు బడ్జెట్ ఉండడంతో భట్టి అసెంబ్లీలో ఉంటారు. అందువల్లే లొకేషన్ మార్చాం” అని వివరించారు. జోడో యాత్రలో చివరిదాకా నడుస్తానో లేదోనని మొదట భయపడ్డానని కాంగ్రెస్ జాతీయ ఆదివాసీ విభాగం వైస్ ప్రెసిడెంట్ బెల్లయ్య నాయక్​ అన్నారు. యాత్రతో 14 కిలోల బరువు తగ్గానని చెప్పారు. దేశాన్ని విచ్ఛిన్న శక్తుల నుంచి కాపాడుకునేందుకే రాహుల్ యాత్ర చేశారని పార్టీ ఓబీసీ జాతీయ కన్వీనర్​కేతూరి వెంకటేశ్​అన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడవడమంటే మామూలు విషయం కాదని పీసీసీ వైస్​ప్రెసిడెంట్​చామల కిరణ్​కుమార్ అన్నారు.