తలసాని పై ఫైర్ అయిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్: బీసీల ఆత్మగౌరవాన్ని మంత్రి కేటీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టాడంటూ తలసాని శ్రీనివాస్ యాదవ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. అభినవ అంబేద్కర్ ,జ్యోతి రావ్ పూలే అంటూ తలసాని కేటీఆర్ భజన చేస్తూ.. తలకుమాసిన మాటలు చెబుతున్నాడని అన్నారు. కేటీఆర్ ను జ్యోతిరావు పూలే తో పోలుస్తూ.. గులాం గిరి చేస్తున్నాడని, దిగజారి పోయాడంటూ తలసానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తలసాని తన మనువడికి కేటీఆర్ పేరు పెట్టడంపై మండిపడుతూ.. ఎవరైనా పేరు పెట్టుకుంటే అంబేద్కర్ పేరో, జ్యోతిరావు పూలే పేరో, మహాత్మా గాంధీ పేరో, దేశ భక్తుల పేర్లో లేదంటే ప్రజలకు తన జీవితాన్ని త్యాగం చేసిన వాళ్ళ పేరో పెట్టుకుంటారు. అది లేదంటే మరో ముఖ్యుల పేర్లో , మన పెద్దల పేర్లో పెట్టుకుంటాం. అలా కాకుండా రోడ్ల మీద జులాయి గా తిరిగే, గెస్ట్ హౌస్ లలో పడుకునే మంత్రి కేటీఆర్ పేరు నీ మనవడికి పెట్టుకుంటావా? అని అన్నారు.
శ్రీనివాస్ యాదవ్ కు తాను డిమాండ్ చేస్తున్నానని.. బస్తీలలో ఉన్న వరద బాధితులకు ఇంతవరకూ సరైన సాయం అందలేదని, వారందరకీ తక్షణసాయం అందివ్వాలని అన్నారు. దీన్ దయాళ్ నగర్ లో సుమేధ అనే పాప సైకిల్తో నాలాలో కొట్టుకుపోతే ఇంతవరకు ఆ కుటుంబానికి నష్ట పరిహారం కూడా ఇవ్వలేదని, ఇప్పటికీ కూడా నాలాలపై కంచె వేయలేదన్నారు. కేటీఆర్ పై పొంకానాలు బంద్ చేసి వరద బాధితులకు సహాయం చెయ్యాలని మంత్రి తలసాని నుద్దేశించి అన్నారు రేవంత్.