ధాన్యం కొనకుండా సీఎం కేసీఆర్ దళారీగా మారాడన్నారు PCC చీఫ్ రేవంత్ రెడ్డి. వరి కుప్పలపైన రైతుల ప్రాణాలు పోతున్నా సీఎం పట్టించుకోవడం లేదన్నారు. వారికి కనీసం రైతు బీమా కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ పోరు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర రెండు రోజుల వరి దీక్ష చేపట్టింది. ఇందులో భాగంగా మాట్లాడిన రేవంత్..రైతుల కష్టానికి దళారులు ధర నిర్ణయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల చావులకు కేసీఆర్ కారణమన్నారు. కల్లాల్లో ఉన్న పంట కొనకుండా, యాసంగి గురించి మాట్లాడాడం సిగ్గుచేటన్నారు.
రూ. లక్ష కోట్లతో ప్రాజెక్టులు కట్టామని చెబుతున్న కేసీఆర్..రైతులు పండించిన ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.కేంద్ర ప్రభుత్వం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని చెబితే...రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 8 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమేనని అన్నారు. ప్రభుత్వం దిగివచ్చి ధాన్యం కొనుగోలు చేసేవరకు కొట్లాడుతామని స్పష్టం చేశారు. వరి కొనకపోతే టీఆర్ఎస్, బీజేపీకి ఉరేనన్నారు.
రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు రేవంత్. రైతులు పండించిన పంటను కొనుగోలు చేసేందుకు ఎఫ్ సీఐ విధానాన్ని తీసుకొచ్చి, గిట్టుబాటు ధర కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీయేనని తెలిపారు. రైతుల కోసం అనేక పథకాలు తీసుకొచ్చిన కాంగ్రెస్ ను సీఎం కేసీఆర్ ప్రశ్నించడం దారుణమన్నారు. కేసీఆర్ ఢిల్లీకి పోయి దావత్ చేసుకొని వచ్చారన్న రేవంత్.. ధాన్యం కొనుగోళ్లపై పార్లమెంట్ లో కొట్లాడుతామన్నారు.