
- ఐదు ఎకరాలు రాయించుకున్నరు: కొత్త మనోహర్ రెడ్డి ఆరోపణ
- ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకుంటున్నారని కామెంట్
- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన రంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్
హైదరాబాద్, వెలుగు: మహేశ్వరం అసెంబ్లీ టికెట్ కోసం బడంగ్పేట మేయర్ చిగురింత పారిజాతా రెడ్డి నుంచి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రూ.10 కోట్లు తీసుకొని 5 ఎకరాలు రాయించుకున్నారని కొత్త మనోహర్ రెడ్డి ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు. టైమ్ వచ్చినప్పుడు అన్ని విషయాలు సాక్ష్యాలతో సహా బయటపెడ్తానంటూ కామెంట్లు చేశారు. మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన మనోహర్ రెడ్డి.. ఖమ్మంలో నిర్వహించిన జనగర్జన సభలో రాహుల్ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ చీఫ్ రేవంత్పై మనోహర్ రెడ్డి చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి.
దీంతో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు రంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ చల్లా నర్సింహా రెడ్డి బుధవారం ప్రకటించారు. రాష్ట్ర స్థాయి నాయకులపై నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మనోహర్ రెడ్డి కామెంట్లు పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకే మనోహర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రేతో లేదంటే ఏఐసీసీ పెద్దలతో చర్చించాలని సూచించారు.