హైదరాబాద్ : రిజర్వేషన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే రైలు బయలుదేరడానికి కనీసం నాలుగు గంటల ముందు వరకే అవకాశం. అప్పటికి సీట్ల రిజర్వేషన్ చార్ట్ బుక్ అయిపోతుంది. సీట్లు ఖాళీగా ఉన్నా బుక్ చేసుకోవడానికి వీలుండదు. కానీ ఇకపై అరగంట ముందు వరకు కూడా టికెట్ బుక్ చేసుకునే అవకాశాన్ని రైల్వే అందుబాటులోకి తెస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త సదుపాయాలు కల్పిస్తున్న IRCTC.. లేటెస్ట్ గా ఆన్లైన్లో బెర్తుల ఖాళీలు చూసుకోవడానికి కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. రైల్వే స్టేషన్లలో ఉన్నవారు కూడా సీటు రిజర్వు చేసుకోవడానికి అవకాశం కలగనుంది. IRCTC లోనే.. ఇప్పటివరకు రైలు బయలుదేరే సమయానికి నాలుగు గంటల ముందు రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ చేసేవారు.
తర్వాత సీట్లు ఖాళీగా ఉన్నా టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉండదు. అసలు ఖాళీలు చూసుకోవడానికే అవకాశం లేదు. TTEల వెంటపడి బతిమిలాడటం, కరెంట్ బుకింగ్కు వెళ్లి ప్రయత్నించడం వంటివి చేసేవారు. కరెంట్ బుకింగ్లు కూడా పెద్ద పెద్ద రైల్వే స్టేషన్లలో మాత్రమే ఉండటంతో ప్రయాణికులకు పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ప్రస్తుతం IRCTC తెచ్చిన కొత్త విధానంలో.. రైల్లో ఖాళీ బెర్తులు ఉంటే అర గంట ముందు వరకు టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. IRCTC వెబ్ సైట్లో ఖాళీలను అందుబాటులో ఉంచుతారు. రైలు బయలుదేరడానికి నాలుగు గంటల ముందు ఫస్ట్ చార్ట్ను, అర గంట ముందు రెండో చార్ట్ను తయారు చేస్తారు. సీటింగ్ లే ఔట్లు వివిధ రంగుల్లో కనిపిస్తాయి.
ఎలా చేసుకోవాలంటే..
IRCTC వెబ్ సైట్లోకి వెళ్లి చార్ట్స్ ఆర్ వెకెన్సీ ఆప్షన్ను ఎంచుకోవాలి. అందులో ప్రయాణ వివరాలు, రైలు నంబర్, తేదీ, బోర్డింగ్ స్టేషన్ వివరాలు ఎంటర్ చేయాలి. దాంతో క్లాస్, కోచ్ ల వారీగా ఖాళీల వివరాలు చూపిస్తుంది. బెర్తుల వారీగా కూడా ఖాళీల స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. తర్వాత టికెట్లను బుక్ చేసుకోవచ్చు. దీనిని ఐఆర్ సీటీసీ వెబ్ సైట్ తోపాటు మొబైల్ యాప్ లోనూ వినియోగించుకునే వెసులుబాటు ఉంది. ప్రయాణికుల సౌకర్యం కోసం, రైల్వేలో పారదర్శకత కోసం ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.