
లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ (178 బంతుల్లో 134: 12 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీతో చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఒకాటాడుకుంటూ అలవోకగా సెంచరీ మార్క్ అందుకున్నాడు. రెండో రోజు ఆటలో భాగంగా శనివారం (జూన్ 21) బషీర్ బౌలింగ్ లాంగన్ దిశగా సిక్సర్ కొట్టి 146 బంతుల్లో కెరీర్ లో పంత్ ఏడో సెంచరీ చేశాడు. రిషబ్ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఈ సెంచరీతో పంత్ అత్యధిక సెంచరీలు చేసిన భారత వికెట్ కీపర్ నిలిచాడు. నిన్నటివరకు ధోనీతో కలిసి ఆరు సెంచరీలతో సమంగా ఉన్న పంత్.. నేడు శతకం బాది ఏడు సెంచరీలతో మిస్టర్ కూల్ ను దాటేశాడు.
ALSO READ | BAN vs SL: చరిత్ర సృష్టించిన శాంటో.. బ్రాడ్మన్, గవాస్కర్, కోహ్లీల సరసన బంగ్లా కెప్టెన్
పంత్, ధోనీ తర్వాత వృద్ధిమాన్ సాహా 3 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్ లోనే పంత్ మూడు సెంచరీలు చేయడం విశేషం. 2018, 2022లో సెంచరీలు కొట్టిన పంత్ నేడు మరో శతకం అందుకున్నాడు. ఓవరాల్ గా ఆస్ట్రేలియా లెజెండరీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్ 17 సెంచరీలతో ఈ లిస్ట్ లో టాప్ లో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో తొలి రోజు 65 పరుగులతో అదరగొట్టిన పంత్.. రెండో రోజు మరో 69 పరుగులు జోడించాడు. ఓవరాల్ గా 134 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పంత్ ఔటయ్యాడు. సెంచరీ చేసి ఊపు మీద కనిపించిన పంత్ (134) టంగ్ వేసిన ఇన్ స్వింగ్ డెలివరీకి ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ కు చేరాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 471 పరుగులకు ఆలౌటైంది. ఒకదశలో 3 వికెట్ల నష్టానికి 430 పరుగులతో 600 పరుగుల దిశగా అడుగులేసిన భారత్.. ఒక్కసారిగా కుప్పకూలింది. కేవలం 41 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ శుభమాన్ గిల్ 147 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. రిషబ్ పంత్ (134), జైశ్వాల్ (105) సెంచరీలతో చెలరేగారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్, స్టోక్స్ తలో నాలుగు వికెట్లు పడగొట్టారు. బషీర్, కార్స్ తలో వికెట్ తీసుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ ప్రస్తుతం 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది.
🚨 RISHABH PANT HAS MOST HUNDREDS BY AN INDIAN WK BATTER IN TEST HISTORY 🚨 pic.twitter.com/0yAPKvLSgW
— Johns. (@CricCrazyJohns) June 21, 2025