ఏలూరులో పెరుగుతున్న వింత రోగం బాధితుల సంఖ్య

ఏలూరులో పెరుగుతున్న వింత రోగం బాధితుల సంఖ్య

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింతరోగం బారిన పడిన బాధితుల సంఖ్య  341కి చేరింది. ఇప్పటికే ఈ వ్యాధి నుంచి కోలుకుని 150 మంది డిశ్చార్జ్ అయ్యారు. 9మందిని విజయవాడ,  గుంటూరు ఆస్పత్రులకు తరలించారు. వింత వ్యాధి బారిన పడి ఇప్పటి వరకు ఒకరు మృతి చెందారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో మరో 60 మందికి చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. నీటి నమూనాల కల్చర్ టెస్ట్ నివేదికలు ఇవాళ వచ్చే అవకాశం ఉంది. వింత రోగానికి మాస్ హిస్టీరియా కారణమని సైక్రియాటిస్టులు చెబుతుండగా…న్యూరో టాక్జిన్స్ కారణం కావచ్చని ఎయిమ్స్ అధికారులు అంటున్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్,  నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీల నిపుణుల బృందాలు ఏలూరుకు  రానున్నాయి. అంతేకాదు మంగళగిరి ఎయిమ్స్ నుంచి ప్రత్యేక డాక్టర్ల టీం ఇక్కడకు రానుంది.

అంతుచిక్కని వ్యాధికి వాయు కాలుష్యం కారణం కాదని కాలుష్య నియంత్రణ మండలి నిర్ధారించింది. నగరంలో పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ టెస్టింగ్ మిషన్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కిరణ్  అంతుచిక్కని వ్యాధితో తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.