హుస్సేన్​సాగర్ సర్ ప్లస్ నాలాపై రిటైనింగ్ వాల్ నిర్మించాలి: రోనాల్డ్ రోస్

హుస్సేన్​సాగర్ సర్ ప్లస్ నాలాపై రిటైనింగ్ వాల్ నిర్మించాలి: రోనాల్డ్ రోస్

హైదరాబాద్, వెలుగు: హుస్సేన్ సాగర్ సర్ ప్లస్ నాలా వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని బల్దియా రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. ఇటీవల హుస్సేన్ సాగర్ సర్ ప్లస్ నాలాలో పడి గల్లంతై మహిళ చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ నాలా ఏరియాను ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్​తో కలిసి శనివారం రోనాల్డ్ రోస్ పరిశీలించారు.

ఈ సందర్భంగా హుస్సేన్ సాగర్ సర్ ప్లస్ నాలాకు ఇరువైపులా ఉన్న మారుతినగర్, దామోదర సంజీవయ్య నగర్ తో పాటు గాంధీనగర్, అశోక్ నగర్ కాలనీల్లో ఆయన పర్యటించారు. నాలా రిటర్నింగ్ వాల్​పై, నాలాను ఆనుకొని ఉన్న నిర్మాణాలను, శిథిలావస్థలో ఉన్న భవనాలను  గుర్తించాలని అధికారులకు సూచించారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైన బఫర్ స్థలం నిర్దేశించిన మేరకు ఎంత ఉండాలో లేక్, టౌన్ ప్లానింగ్ అధికారులు వెంటనే పూర్తి రిపోర్టు అందజేయాలన్నారు. దామోదర సంజీవయ్య నగర్ నాలాకు ఆనుకుని ఉన్న కొన్ని భవనాలు వరదకు కొట్టుకొపోయి పునాది లేకుండా ఉన్నాయని.. భారీ వర్షం పడితే అవి కూలిపోయే ప్రమాదం ఉందన్నారు.

అలాంటి భవనాలపై ఫోకస్ పెట్టి ముందస్తుగా కూల్చివేత చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. ఇందిరా పార్కు  అభివృద్ధికి చేపట్టాల్సిన పనులపై ఆయన సమీక్షించారు. పార్కు బ్యూటిఫికేషన్​లో భాగంగా వాకర్స్ అసోసియేషన్​తో పాటు ఆసక్తి ఉన్న మరో 12 మందితో  కమిటీ వేసి వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. రోనాల్డ్ రోస్ వెంట సికింద్రాబాద్ జడ్సీ రవికిరణ్, లేక్స్ సీఈ, హౌసింగ్ ఓఎస్డీ సురేశ్ కుమార్, టౌన్ ప్లానింగ్ అధికారి రాజేంద్ర ప్రసాద్, అధికారులు ఉన్నారు.