యాదాద్రి లో ‘ఆర్వోఆర్’...భూ సేకరణకు ప్రిలిమినరీ నోటిఫికేషన్

యాదాద్రి లో ‘ఆర్వోఆర్’...భూ సేకరణకు ప్రిలిమినరీ నోటిఫికేషన్
  •  పగిడిపల్లి మినీ జంక్షన్​ వద్ద  రైల్ ​ట్రాఫిక్​ 
  •  గంటల కొద్దీ రైళ్ల నిలిపివేత
  •  సమస్య అధిగమించడానికి
  • బీబీనగర్​ టు బొమ్మాయిపల్లి వరకు రైల్ ​ఓవర్ రైల్​
  •  రిజిస్ట్రేషన్​ వ్యాల్యూ ఎకరాకు రూ. 17.06 లక్షల నుంచి రూ. 29.40 లక్షలు
  •  నిర్వాసితులకు మూడు రెట్లు పరిహారం

యాదాద్రి, వెలుగు : రైళ్ల ట్రాఫిక్​సమస్య అధిగమించడానికి  ఆ శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లా బీబీనగర్​-బొమ్మాయిపల్లి మధ్య రైల్ ఓవర్​ రైల్​(ఆర్​వోఆర్​) నిర్మాణానికి ప్రాసెస్​మొదలైంది. భూ సేకరణ కోసం ప్రిలిమినరీ నోటిఫికేషన్​రిలీజ్​చేశారు. 

పగిడిపల్లి వద్ద రెండు రైలు మార్గాలు..

యాదాద్రి జిల్లా మీదుగా గుంటూరు టు సికింద్రాబాద్, సికింద్రాబాద్​టు కాజీపేట రైలు మార్గాలు ఉండగా, నిత్యం వందలాది రైళ్ల రాకపోకలు సాగుతున్నాయి. ఈ మార్గాలు ఎప్పుడూ రైళ్ల ట్రాఫిక్​తో బిజీగా ఉంటాయి. అయితే ఈ  రెండు మార్గాలు బీబీనగర్​ మండలం పగిడిపల్లి మినీ జంక్షన్​ వద్ద కలుస్తాయి. ఈ మార్గాల్లో నడిచే రైళ్లు ఒకే సమయంలో చేరుకునే సందర్భాలు అనేకం. దీంతో ఒక మార్గంలో వచ్చే రైలును ఆపి, మరో మార్గంలో వచ్చే రైలును పంపిస్తూ ఉంటారు. దీనివల్ల రైళ్లలో ప్రయాణించే వాళ్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 

సమస్య అధిగమించడానికి ఆర్​వో ఆర్​

రైలు, రోడ్డు మార్గాలు కలిసే రూట్లలో రైల్వే ఓవర్​ బ్రిడ్జి (ఆర్​వోబీ) లేదా అండర్​ పాస్​ నిర్మించి ట్రాఫిక్​ సమస్య ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. రెండు రైలు మార్గాలు కలుస్తున్న ప్లేస్​లో రైళ్ల ట్రాఫిక్​ అధిగమించడానికి రైల్​ ఓవర్​ రైల్​ (ఆర్​వోఆర్​) నిర్మిస్తున్నారు. రైలు మార్గాలు కలుస్తున్న చోట ఒక రూట్ మీదుగా బ్రిడ్జి నిర్మించి దాని మీదుగా రైళ్లు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ తరహాలోనే సికింద్రాబాద్​టు  కాజీపేట (బీబీనగర్​ మండలం గూడూరు) మార్గం మీదుగా సికింద్రాబాద్ టు గుంటూరు నడికుడి రూట్​(భువనగిరి మండలం బొమ్మాయిపల్లి) వరకూ రైల్​ ఓవర్​ రైల్​ బిడ్జి నిర్మాణం కోసం ప్రణాళిక రూపొందించారు. ఈ తరహాలో విజయవాడ సెక్షన్ ​పరిధిలోని గూడూరు, మునుబోలు మధ్య ఆర్​వోఆర్ నిర్మించారు. 

భూ సేకరణకు  ప్రిలిమినరీ నోటిఫికేషన్​ 

బీబీనగర్ నుంచి బొమ్మాయిపల్లి వరకు దాదాపు 8 కిలోమీటర్లు నిర్మించే ఆర్​వోఆర్​ కు కావాల్సిన భూమి కోసం ప్రిలిమినరీ నోటిఫికేషన్​ రిలీజ్​చేశారు. బీబీనగర్​, పగిడిపల్లి గ్రామాల్లోని 40 సర్వే నెంబర్లలోని 25.18 ఎకరాలు అవసరం పడుతుందని నోటిఫికేషన్​లో పేర్కొన్నారు. 

పరిహారం మూడు రెట్లు..

భూ సేకరణ చట్టం 2013 ప్రకారం సేకరించే భూమికి ప్రభుత్వం మూడు రెట్ల పరిహారం అందించనుంది. ఆర్​వోఆర్​ కోసం ప్రిలిమినరీ నోటిఫికేషన్​ ప్రకారం 25.18 ఎకరాలను సేకరించాల్సి ఉంటుంది. ఇందులో బీబీనగర్​లో 3.07 ఎకరాలు, పగిడిపల్లిలో 4.81 ఎకరాలు, గూడూరులో 17.70 ఎకరాలను సేకరించాల్సి ఉంటుంది. ఈ గ్రామాల్లో ఎకరానికి రూ. 17.06 లక్షల నుంచి 29.40 లక్షల వరకూ రిజిస్ట్రేషన్​ ​ వ్యాల్యూ ఉంది. 

అయితే ఇంకా సర్వే చేయకపోవడంతో సేకరించే భూమిలో కొంత హెచ్చుతగ్గులు ఉండే అవకాశ ముంది.  కాగా, ఆర్​వోఆర్​ కోసం జరిగే భూ సేకరణలో తనకు అన్యాయం జరుగుతోందని బాధిత రైతు బాల్​రెడ్డి కోర్టును ఆశ్రయించాడు. ఈ ఆర్​వోఆర్​ కారణంగా తన భూమి మూడు భాగాలుగా విడిపోతోందని సదరు రైతు తన పిటీషన్​లో పేర్కొన్నారు. రెండు ట్రాక్​ల మధ్య మిగిలే ఆ భూమి తనకు ఎందుకు పనికిరాదని పేర్కొన్నారు.