న్యూఢిల్లీ : పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్(పీఎంసీ) బ్యాంక్లో చోటు చేసుకున్న వేల కోట్ల కుంభకోణంలో పలు కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. బ్యాంక్ రికార్డుల నుంచి రూ.10.5 కోట్ల క్యాష్ మిస్ అయినట్టు పీఎంసీ బ్యాంక్ ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ గుర్తించింది. ఆర్బీఐ నియమించిన అడ్మినిస్ట్రేటర్ ఆదేశాల మేరకు ఈ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏర్పాటైంది. దివాలా తీసిన హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(హెచ్డీఐఎల్)కు, దాని సబ్సిడరీలకు మోసపూరితంగా పీఎంసీ బ్యాంక్ అధికారులు లోన్స్ను ఇచ్చారని ఆరోపించింది. హెచ్డీఐఎల్, ఇతర సంబంధిత సంస్థలకు పలు చెక్లను జారీ చేయడం ద్వారా రూ.10 కోట్లకు పైన ఇచ్చినట్టు పీఎంసీ ఫైనాన్సియల్ ట్రాన్సాక్షన్స్లో వెల్లడైంది. కానీ వాటిని బ్యాంక్ రికార్డుల్లో ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. బ్యాంక్లో కూడా డిపాజిట్ చేయలేదు. ఈ చెక్లన్నింటిన్నీ కూడా గతరెండేళ్ల కాలంలో పీఎంసీ మాజీ ఎండీగా జాయ్ థామస్కు పంపినట్టు తెలిసింది. బ్యాంక్ రికార్డుల్లో చూపించకుండా ఆ చెక్ల మొత్తాన్ని హెచ్డీఐఎల్ పార్టీలకు నగదు కింద ఇచ్చినట్టు కనుగొన్నది. రూ.50 లక్షల నుంచి రూ.55 లక్షల మొత్తం కూడా బ్యాంక్ రికార్డుల్లో మిస్ అయింది. పీఎంసీ బ్యాంక్ కుంభకోణంలో భాగంగా ముంబై పోలీసు ఆర్థిక నేరాల విభాగం అదుపులో ఉన్న థామస్కు కోర్టు అక్టోబర్ 22 వరకు రిమాండ్ విధించింది.