నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: స్వయం సహాయక మహి ళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అం దించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో రూ.304 కోట్ల వడ్డీలను జమచేసింది. మొత్తం 3,57,098 సంఘాలకు ఈ నిధులు చేరాయి. సోమవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, సెర్ప్ సీఈఓ దివ్యాదేవరాజన్, డీఆర్డీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మహిళలను ఆర్థికంగా నిలబెట్టడంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు.
ప్రతిఏటా రూ.25 వేల కోట్లకు తగ్గకుండా మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తూ.. వాటికి వడ్డీ భారం లేకుండా ప్రభుత్వం తరఫునే వడ్డీలను చెల్లించడం కొనసాగుతుందని చెప్పారు. ఇప్పటివరకు గ్రామీణ సంఘాలకు రూ.1,118 కోట్ల వడ్డీ రహిత రుణాలు చెల్లించామని పేర్కొన్నారు.
ఇవి కాకుండా పట్టణ మహిళా సంఘాలకు సుమారు రూ.300 కోట్ల వడ్డీ చెల్లించామని వెల్లడించారు. మహిళలపై వడ్డీల భారం లేకుండా ప్రభుత్వమే వాటిని భరిస్తున్నదని, మహిళల సాధికారతను శాశ్వతంగా నిలబెట్టేలా ముందుకెళ్తున్నామని వివరించారు. మహిళా సంఘాలకు చెల్లించాల్సిన రూ.3,500 కోట్ల వడ్డీలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఎగవేసిందని ఆరోపించారు.
ప్రజా ప్రభుత్వం మహిళా సంఘాలకు నిధులను సకాలంలో అందిస్తూ వారి ఆర్థిక శక్తిని మరింతగా పెంచే దిశగా కృతనిశ్చయంతో పనిచేస్తుందన్నారు.
