హైదరాబాద్ సిటీ, వెలుగు: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగిలోని ఆరుణోదయ హౌసింగ్ సొసైటీలో ఉన్న పార్కును కబ్జా నుంచి హైడ్రా కాపాడింది. నార్సింగ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు చేరువలో అరుణోదయ కాలనీ హుడా అనుమతి పొందిన లేఅవుట్లో 6078 గజాలను పార్కు కోసం కేటాయించారు. ఈ పార్కు స్థలంపై స్థానికంగా ఉన్న కొందరు..3 వేల గజాల వరకూ ఆక్రమించి, నిర్మాణాలు చేపట్టారు.
మిగిలిన 3 వేల గజాల పార్కు స్థలంలో రూ. 60 కోట్ల విలువైన 1600ల గజాలను స్థానికంగా ఉన్న వ్యక్తి కబ్జా చేశారు. ప్రహరీ నిర్మించి.. అందులో షెడ్లు వేశారు. ఈ 1600 గజాల ఆక్రమణలో ఉన్న నిర్మాణాలను గతంలో నార్సింగి మున్సిపాలిటీ అధికారులు తొలగించారు. అయినా కబ్జాలు ఆగలేదు. నార్సింగి మున్సిపాలిటీ ఇప్పుడు జీహెచ్ఎంసీలో కలవడంతో.. ఇదే అదనుగా మళ్లీ ఆక్రమించారు.
చుట్టూ ప్రహరీ నిర్మించి..లోపల తాత్కాలిక షెడ్లు కూడా కట్టాడు. దీనిపై స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు సోమవారం హైడ్రా , రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు స్థలాన్ని పరిశీలించారు. ఆక్రమణకు గురైన 3 వేల గజాలను కాపాడారు. పార్కు కోసం కేటాయించిన స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది.
