వందల కోట్లు ఏ పందికొక్కులు బుక్కినయ్..?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 

వందల కోట్లు ఏ పందికొక్కులు బుక్కినయ్..?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 

వరంగల్ ​జిల్లాలోని భట్టుతండా ప్రైమరీ స్కూల్​లో పాముకాటుకు గురై బాలిక చనిపోయిన ఘటనపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. మన ఊరు, మన బడి పథకం పేరిట కోట్ల రూపాయలు మెఘా-ర్పణం చేసి, పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని గొప్పలు చెప్పుకున్న ఈ పాపం ఎవరిది అంటూ ట్విట్టర్ వేదికగా రాష్ర్ట ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  ‘వందల కోట్ల రూపాయలు ఏ పందికొక్కులు బుక్కినయ్..? ప్రభుత్వ పాఠశాలల నిర్వహణను నిర్వీర్యం చేయడమేనా..? మీ లక్ష్యం’ అంటూ ట్విట్టర్ వేదికగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

స్కూల్​లో పాము కాటుతో చిన్నారి మృతి

భట్టు మోహన్, పార్వతిలకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు భట్టు మన్విత (6) వరంగల్​జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండ శివారులోని భట్టుతండాలోని ప్రైమరీ స్కూల్​లో చదువుతోంది. నిన్న ఉదయం స్కూల్​కు వెళ్లింది. గురువారం (ఇవాళ) చెవులు కుట్టే ప్రోగ్రాం ఉందని ఫ్రెండ్స్​కు చెప్పుకొని మురిసిపోయింది. బాత్​రూం వస్తుందని టీచర్​కు చెప్పడంతో వెళ్లమన్నాడు. క్లాస్ రూం నుంచి బయటికొచ్చిన మన్విత.. మెట్లు దిగుతుండగా తాచుపాము కాటేసింది. ఈ విషయాన్ని టీచర్‌‌కు చెప్పడంతో అతను పేరెంట్స్​కు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి మన్వితను నర్సంపేట హాస్పిటల్​కు తరలిస్తుండగా, మార్గమధ్యలో చనిపోయింది. చెవులు కుట్టే ప్రోగ్రాం ఉండటంతో ఇంటికొచ్చిన బంధువులు మన్విత చనిపోయిందని తెలుసుకుని కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.