30 మంది పాసింజర్లుంటే  ఇంటికే ఆర్టీసీ బస్‌‌

30 మంది పాసింజర్లుంటే  ఇంటికే ఆర్టీసీ బస్‌‌
  • దసరా ప్యాకేజీ ప్రకటించిన సంస్థ
  • పండుగకు 4 వేల స్పెషల్ బస్సులు

హైదరాబాద్‌‌, వెలుగు : దసరా పండుగ నేపథ్యంలో 30 లేదా అంతకంటే ఎక్కువ మంది పాసింజర్లు ఉంటే ఇంటికి లేదా చెప్పిన ప్రాంతానికే బస్‌‌ వస్తుందని ఆర్టీసీ ప్రకటించింది. ఇన్ఫర్మేషన్‌‌ సెంటర్‌‌ నుంచి వివరాలు తీసుకుని ముందుగా బుక్‌‌ చేసుకోవాలని సంస్థ ఎండీ సజ్జనార్‌‌ తెలిపారు. బుధవారం నుంచి సమాచార సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రేతిఫైల్‌‌ (99592 26154), కోఠి బస్‌‌ స్టేషన్ (99592 26160), ఎంజీబీఎస్‌‌ (99592 26257 ), జూబ్లీ బస్‌‌ స్టేషన్‌‌ (99592 26246) నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. ఈ సెంటర్లు 24 గంటలు పనిచేస్తాయని చెప్పారు. ప్రైవేట్‌‌ బస్సుల్లో ప్రయాణించడం సేఫ్టీ కాదని పేర్కొన్నారు. 
4,035 ప్రత్యేక బస్సులు..
దసరా పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాలకు 4,035 స్పెషల్ బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. ఎంజీబీఎస్‌‌, సీబీఎస్‌‌, జూబ్లీ బస్‌‌స్టేషన్‌‌, దిల్‌‌సుఖ్‌‌నగర్‌‌, లింగంపల్లి, చందానగర్, కేపీహెచ్‌‌బీ, ఎస్‌‌ఆర్‌‌ నగర్‌‌, అమీర్‌‌పేట్‌‌, టెలిఫోన్‌‌ భవన్, ఈసీఐఎల్‌‌, ఉప్పల్‌‌ క్రాస్‌‌ రోడ్డు, ఎల్‌‌బీనగర్‌‌తోపాటు సిటీలో ఇతర పాయింట్ల నుంచి స్పెషల్‌‌ బస్సులు నడుపుతామని చెప్పింది. ఈనెల 8 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడపనుండగా, రద్దీని దృష్టిలో ఉంచుకుని 11వ తేదీ నుంచి సర్వీసులను పెంచుతామని వెల్లడించింది. 450 స్పెషల్‌‌ బస్సులకు అడ్వాన్స్‌‌ రిజర్వేషన్‌‌ ఫెసిలిటీ ఉందని, www.tsrtconline.inలో టికెట్లు బుక్‌‌ చేసుకోవచ్చని చెప్పింది.