జోరుగా ఇండ్ల అమ్మకాలు
మార్చిలో రూ.3,352 కోట్ల విలువైన యూనిట్ల సేల్
హైదరాబాద్, వెలుగు : నగరమంతటా రెసిడెన్షియల్ ప్రాపర్టీల అమ్మకాలు జోరు మీద ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్లో 6,414 యూనిట్ల రెసిడెన్షియల్ ప్రాపర్టీలు అమ్ముడయ్యాయి. ఇదే ఏడాది ఫిబ్రవరితో పోలిస్తే సేల్స్12 శాతం పెరిగాయి. మార్చిలో అమ్ముడైన ఆస్తుల మొత్తం విలువ రూ. 3,352 కోట్లు కాగా, ఇది కూడా నెలవారీగా 12.2శాతం పెరిగింది. అయితే 2022 మార్చితో పోలిస్తే మాత్రం ఈసారి మార్చిలో అమ్మకాలు ఐదు శాతం తగ్గాయి. రియల్ ఎస్టేట్కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా రిపోర్టు ద్వారా ఈ విషయాలు తెలిశాయి.
హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్లో హైదరాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలు ఉన్నాయి. మొత్తం అమ్మకాల్లో రూ.25 – 50 లక్షల ప్రైస్ బ్యాండ్లోని రెసిడెన్షియల్ యూనిట్లు 53శాతం ఉన్నాయి. గతేడాది మార్చితో పోలిస్తే ఈసారి మార్చిలో 500–1000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆస్తుల కేటగిరీలో రిజిస్ట్రేషన్ల వాటా 16 శాతం ఉంది. 1,000–-2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆస్తుల వాటా అత్యధికంగా 70 శాతం వాటాతో ఉంది. మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలో ఇళ్ల అమ్మకాల రిజిస్ట్రేషన్లు 42శాతం నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 35శాతం రికార్డయ్యాయి. మొత్తం రిజిస్ట్రేషన్లలో హైదరాబాద్ జిల్లా వాటా ఈ ఏడాది మార్చిలో 14శాతంగా రికార్డయింది. రెసిడెన్షియల్ ప్రాపర్టీల సగటు ధరలు 2023 మార్చిలో వార్షికంగా10శాతం పెరిగాయి. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 15శాతం పెరిగాయి.
హోంలోన్ వడ్డీ రేట్లు కొంచెం ఎక్కువగానే ఉన్నప్పటికీ ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్ రిజిస్ట్రేషన్లు బలంగానే కొనసాగాయి. 1,000 నుంచి 2,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. అత్యధిక రిజిస్ట్రేషన్లు ఇదే కేటగిరీ నుంచే జరిగాయి. ఎక్కువ స్థలం, సౌకర్యాలు ఉన్న ఇండ్లకు గిరాకీ బాగుంది.
‑ శామ్సన్ ఆర్థర్, నైట్ ఫ్రాంక్, ఇండియాలో సీనియర్ బ్రాంచ్ డైరెక్టర్
