
- అయినా కనిష్ట పెట్టుబడి గ్రేడ్ ‘బీబీబీ మైనస్’ దగ్గరనే
న్యూఢిల్లీ : ఇండియా సావరిన్ రేటింగ్ను 14 ఏళ్ల తర్వాత మొదటి సారిగా ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అప్గ్రేడ్ చేసింది. ఎకానమీ వృద్ధి చెందుతుండడంతో ఇప్పటి వరకు ఉన్న ‘స్టేబుల్’ నుంచి ‘పాజిటివ్’ కి పెంచింది. గత ఐదేళ్లలో ప్రభుత్వ క్యాపెక్స్ పెరిగిందని, సంస్కరణలు, ఆర్థిక పాలసీలు మెరుగయ్యాయని ఎస్ అండ్ పీ వెల్లడించింది. అయినప్పటికీ ఇండియా సావరిన్ రేటింగ్ను కనిష్ట పెట్టుబడి గ్రేడ్ ‘బీబీబీ మైనస్’ దగ్గరనే కొనసాగించింది. ఫిస్కల్, మానిటరీ పాలసీలను జాగ్రత్తగా అమలు చేస్తే ఇంకో 24 నెలల్లో ఇండియా రేటింగ్ అప్గ్రేడ్ అవుతుందని వివరించింది.
కాగా, సావరిన్ రేటింగ్ బాగుంటే దేశాలు సేకరించే అప్పులపై తక్కువ వడ్డీని చెల్లించడానికి వీలుంటుంది. ఫలితంగా ప్రభుత్వానికి వడ్డీ ఖర్చులు తగ్గుతాయి. ఆర్బీఐ రూ.2.10 లక్షల కోట్ల డివిడెండ్ను ప్రకటించిన వారంలోపే ఎస్ అండ్ పీ ఇండియా సావరిన్ రేటింగ్ను మెరుగుపరచడాన్ని గమనించాలి. ఈ ఫండ్స్తో కేంద్ర ఫిస్కల్ డెఫిసిట్ దిగొస్తుంది. ప్రభుత్వ ఖర్చులు ఇన్ఫ్రాస్ట్రక్చర్పై పెరిగాయని, ఆర్థిక పరమైన క్రమశిక్షణ ఉందని ఎస్ అండ్ పీ వివరించింది. ఫలితంగా దేశ క్రెడిట్ రేటింగ్ మెరుగుపడుతుందని అంచనా వేసింది.
ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ఆర్థిక సంస్కరణలు కొనసాగుతాయని, ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఖర్చులు పెంచడంతో లాంగ్ టెర్మ్ గ్రోత్ ఉంటుందని పేర్కొంది. కాగా, మోదీ ప్రభుత్వం క్యాపిటల్ ఎక్స్పెండిచర్కు కేటాయింపులు పెంచింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.11 లక్షల కోట్లు లేదా జీడీపీలో 3.4 శాతం ఇన్ఫ్రాకు కేటాయిస్తారని అంచనా. పదేళ్ల క్రితంతో పోలిస్తే ఇది 4.5 రెట్లు ఎక్కువ.