- సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్
జోగిపేట,పుల్కల్ వెలుగు: అకాల వర్షాల నేపథ్యంలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, కేంద్రాలకు తీసుకువచ్చే ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం జోగిపేట మార్కెట్ యార్డు, చౌటుకూరు మండలం కొర్పోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించారు.
కేంద్రాల్లో రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, హమాలీలు, లారీలు, టార్పాలిన్ కవర్లు, గోనె సంచుల లభ్యత, ట్యాబ్ ఎంట్రీలు, ట్రక్ షీట్ల జనరేషన్, మిల్లులకు తరలించిన ధాన్యం వివరాలు, రైతుల ఖాతాల్లో జమ చేసిన డబ్బుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సివిల్ సప్లై డీఎం అంబదాస్, డీఆర్డీవో పీడీ జ్యోతి, డీసీవో కిరణ్ కుమార్, వ్యవసాయ శాఖ ఏడీ ప్రసాద్, తహసీల్దారులు, కొనుగోలు కేంద్రాల సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
