వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి టిక్కెట్ కాంగ్రెస్ కార్యకర్తకే..

వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి టిక్కెట్ కాంగ్రెస్ కార్యకర్తకే..

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తకే ఈసారి సంగారెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని, ఒకవేళ కార్యకర్తలు వద్దంటే తన భార్య నిర్మలను ఎన్నిక బరిలో నిలుపుతానని తెలిపారు. మళ్ళీ 2028 ఎన్నికల్లోనే పోటీ చేస్తానని అన్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే తాను పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, అయితే.. ఈ విషయంలో తనపై ఎవరి ఒత్తిళ్లు లేవన్నారు. తాను ఒక టర్మ్ ఎలక్షన్స్ లో పోటీ చేయకుండా ఎందుకు దూరంగా ఉన్నాననే విషయం తర్వాత అందరికీ తెలుస్తుందని చెప్పారు. దాదాపు రెండున్నర నెలల తర్వాత సీఎల్పీ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఈ కామెంట్స్ చేశారు. 

యశ్వంత్ సిన్హాను కలిస్తే..

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ కు వచ్చిన సమయంలో కాంగ్రెస్ నేతల మధ్య గొడవలు జరిగాయి. యశ్వంత్ సిన్హాను కలిస్తే గోడకేసి కొడుతానని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్స్ చేయడంతో.. దానిపై జగ్గారెడ్డి ఘాటుగా స్పందించారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించలేదు. నవంబర్ 5వ తేదీన గాంధీభవన్ లో ప్రెస్ మీట్ పెడుతానని, అప్పటి వరకు అటు వైపు వెళ్లనని ఈ మధ్య సంగారెడ్డిలో చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మర్రి శశిధర్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అద్దంకి దయాకర్, మహేశ్వర్ రెడ్డి కామెంట్స్ పై కూడా ఏం మాట్లాడలేదు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశానికి కూడా ఎమ్మెల్యే జగ్గారెడ్డి హాజరుకాలేదు. ఇవాళ భారత్ జోడో యాత్రకు కూడా వెళ్లేలేదు. కానీ, ఉన్నట్టుండి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఎమ్మెల్యే జగ్గారెడ్డి చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.