పాము కాటుకు మాంత్రికుడి వైద్యం..ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషయం

పాము కాటుకు మాంత్రికుడి వైద్యం..ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషయం

మహబూబాబాద్ జిల్లా : ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురిని పాము కాటు వేసింది. వీరిలో ఒకరు మృతి చెందగా..మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.  ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. నర్సింహులపేట మండలంలోని యర్రచక్రుతండాకు చెందిన జాతోటు రవి(45), భార్య నీల, కుమారులు శరణ్‌, సాయి, కుమార్తె శైలజ ఒకే మంచంపై నిద్రిస్తున్నారు. రాత్రి 9 గంటల సమయంలో నూనెకట్లపాము రవిని, ఆ తర్వాత నీలను, శరణ్‌ ను కాటేసింది. ఏదో కుట్టిందని లేచి చూసేసరికి మంచంపై పాము కనిపించడంతో.. కర్రతో కొట్టి చంపారు.

స్థానికుల సలహామేరకు గ్రామంలో మంత్రగాడి దగ్గరకు వెళ్లి నాటు వైద్యం చేయించుకున్నారు. అయినా నొప్పి తగ్గలేదు. పరిస్థితి విషమించడంతో బంధువులు జిల్లా కేంద్రంలోని ఏరియా హస్పిటల్ కి తరలించారు. అయితే ట్రీట్ మెంట్ తీసుకుంటూ రవి మృతిచెందగా ..నీల, శరణ్‌ పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు డాక్టర్లు. దీంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ఓ ప్రైవేటు హస్పిటల్ కు తరలించామని తెలిపారు బంధువులు. పాము కరిచిన వెంటనే తీసుకువస్తే రవి బతికేవాడని తెలిపారు డాక్టర్లు.