వర్షాలు, ప్రకృతి విపత్తుల నిర్వహణపై అధికారుల అలసత్వంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూన్ 1నే ముందస్తు సూచనలు ఇచ్చినప్పటికీ.. జూన్ 9న కురిసిన వర్షానికి అధికారులు క్షేత్రస్థాయిలో సరిగా పనిచేయకపోవడంపై సీఎం మండిపడ్డారు. మున్సిపల్, పోలీస్ విభాగాల మధ్య సమన్వయ లోపాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.
ఇకపై వర్షం పడే సమయంలో ట్రాఫిక్ ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ రోడ్లపైనే ఉండాలని సీఎం స్పష్టం చేశారు. అవసరమైతే నేను కూడా రోడ్డు మీదికి వస్తా అంటూ అధికారులకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా విద్యుత్ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలని, వాటర్ లాగింగ్ పాయింట్స్, ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాలను ముందే గుర్తించాలని ఆదేశించారు.
మానవ తప్పిదాల వల్ల ప్రజలకు సమస్యలు వస్తే అస్సలు సహించేది లేదని.. ఫీల్డ్లో ఉండని అధికారులపై కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. అలాగే, ట్రాఫిక్ విభాగంలో ఉన్న ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు.
