కుల సమీకరణాల్లో ఖమ్మం బీజేపీ సీటు!

కుల సమీకరణాల్లో ఖమ్మం బీజేపీ సీటు!
  • సామాజిక వర్గాలవారీగా చీలిన లీడర్లు
  • కులాలవారీగా ఆశావహులకు మద్దతు
  • బీఆర్ఎస్​లోని కమ్మ నేత కోసం బలమైన లాబీయింగ్​
  • అయోమయంలో ‘జలగం’ అనుచరులు

ఖమ్మం, వెలుగు : ఖమ్మం లోక్​సభ టికెట్​పై బీజేపీలో సంకుల సమరం నడుస్తున్నది. సంస్థాగతంగా పెద్దగా బలం లేని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ టికెట్​ కోసం నెలకొన్న పోటీ రాజకీయవిశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఖమ్మం బీజేపీ టికెట్​ కోసం సుమారు పది మంది ఆశావహులు రేసులో ఉండగా,   బీఆర్ఎస్​ కు చెందిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు పార్టీలో చేరాక దాదాపు అందరూ ఆశలు వదిలేసుకున్నారు. తీరా హైకమాండ్​ఆయన పేరును ప్రకటించకపోవడంతో ఆశావహులంతా మళ్లీ యాక్టివ్​ అయ్యి,  తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

హైదరాబాద్​ కేంద్రంగా కులాలవారీగా తమ గాడ్​ ఫాదర్ల ను ప్రసన్నం చేసుకోవడం, ఆయా నాయకులు కూడా హామీ ఇస్తుండడం ఆసక్తి రేపుతోంది. మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పటికీ జలగం వైపే మొగ్గుచూపుతుండగా,  బీఆర్ఎస్​ నుంచి ఓ ముఖ్య నేతను లాగేందుకు కమ్మవర్గానికి చెందిన నేతలు దిల్లీ స్థాయిలో లాబీయింగ్​ చేస్తుండడంతో వెంకట్రావు , ఆయన అనుచరులు అయోమయంలో పడ్డారు. 

సామాజిక వర్గాలవారీగా నేతల మద్దతు

ఖమ్మం టికెట్​ ఆశిస్తున్న వారిలో ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు కాగా, ఆయనకు మాజీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్​ రావు మద్దతిస్తున్నారు. కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రంగా కిరణ్ మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన వారు కాగా, బీజేపీ సీనియర్​ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్​ కె.లక్ష్మణ్​ మద్దతిస్తున్నట్టు టాక్​ నడుస్తోంది.

2019 ఎన్నికల్లో పోటీ చేసిన దేవకీ వాసు దేవరావుది ఆర్యవైశ్య సామాజికవర్గం. ఖమ్మం నగరానికి చెందిన డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు పద్మశాలి సామాజికవర్గానికి చెందినవారు కాగా, ఆయనకు టికెట్​ ఇవ్వాలని పొంగులేటి సుధాకర్​ రెడ్డి కోరుతున్నట్టు తెలుస్తోంది. అయితే వెలమ సామాజికవర్గానికి చెందిన తాండ్ర వినోద్​ రావుకు టికెట్ ఇవ్వాలని ఈటల రాజేందర్​, ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు (వెలమ)కు టికెట్​ ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి పట్టుబడుతున్నట్టు సమాచారం. ఇక బీజేపీ సీనియర్​ నేత, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్​ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈవీ రమేశ్​(గౌడ్) టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. 

దిల్లీ స్థాయిలో లాబీయింగ్​.. 

రాష్ట్రంలో బీజేపీ ఇప్పటి వరకు ప్రకటించిన వారిలో ఒక్క కమ్మ అభ్యర్థికి కూడా లేడని, ఖమ్మం టికెట్​ ఎలాగైనా కమ్మ సామాజికవర్గానికి ఇవ్వాలంటూ బీజేపీలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ టికెట్​ రేసులో ఉండగా, అదే సామాజికవర్గానికి చెందిన మరో ముఖ్య నేత కోసం కమ్మ సామాజికవర్గానికి చెందిన రాష్ట్ర నేతలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్​ లో ఉన్న ఆ లీడర్​ కు టికెట్​ ఇప్పించేందుకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ద్వారా దిల్లీ స్థాయిలో మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. ఆయనకు పార్టీలో రూట్​ క్లియర్​ చేసేందుకే ఇంకా ఖమ్మం టికెట్​ పెండింగ్ పెట్టారన్న టాక్ నడుస్తోంది.