ఆగస్టు 16 నుంచి  ఏపీలో పాఠశాలల పునఃప్రారంభం

ఆగస్టు 16 నుంచి  ఏపీలో పాఠశాలల పునఃప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో క్రమంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతోంది. దీంతో..స్కూళ్లను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ(శుక్రవారం) విద్యాశాఖకు సంబంధించి నాడు-నేడు కార్యక్రమం జరిగింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. ఆగస్టు 16 నుంచి పాఠశాలలను ప్రారంభించాలని చెప్పారు. అదే రోజున నాడు-నేడు పనులను ప్రజలకు అంకితం చేయాలన్నారు. నాడు-నేడు పనుల్లో అవినీతికి తావుండకూడదని చెప్పారు. పాఠశాలల అభివృద్ధిపై గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి ప్రయార్టీ ఇస్తోందన్నారు. స్కూళ్లు పునఃప్రారంభమయ్యే రోజునే రెండో విడత నాడు-నేడు పనులకు శ్రీకారం చుడతామని తెలిపారు సీఎం జగన్.

సమావేశం తర్వాత విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 16న పాఠశాలలను పునఃప్రారంభిస్తామని, ఆ రోజున అనేక కార్యక్రమాలను పండుగలా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. తొలి విడత నాడు-నేడు కార్యక్రమం కింద 15 వేలకు పైగా స్కూళ్లను తీర్చిదిద్దామని తెలిపారు. రెండో దశ కింద 16 వేల స్కూళ్లను అభివృద్ది చేస్తామన్నారు.