ఏపీలో ఆగస్టు 16 నుంచి స్కూళ్లు ప్రారంభం

ఏపీలో ఆగస్టు 16 నుంచి స్కూళ్లు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెల నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 16 నుంచి బడులు ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో జరిగిన విద్యాశాఖ సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 12 నుంచే ఆన్ లైన్ క్లాసులను ప్రారంభించనున్నారు. విద్యాసంస్థల్లో పెండింగ్ లో ఉన్న ‘నాడు–నేడు’ పనులన్నింటినీ ఆగస్టులోపు పూర్తి చేయాల్సిందిగా అధికారులకు సీఎం ఆదేశాలిచ్చారు. నాడు-నేడు కింద పనుల కోసం రూ.16 వేల కోట్లతో బడ్జెట్ సిద్ధం చేయాలన్నారు.

స్కూళ్లలో మంచి విద్యను అందించేందుకు సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. కొత్త విద్యావిధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఈ విధానంతో ఏ ఒక్క ఉపాధ్యాయుడి పోస్టూ తక్కువ కాదని.. ఏ బడీ మూతపడదని తెలిపారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు టీచర్లకు వర్క్ బుక్స్ పై శిక్షణనిస్తామన్నారు.

ఫౌండేషన్ స్కూళ్లకు రెండేళ్లలో అదనపు గదులను నిర్మించి ఇస్తామన్నారు. ఇంటర్ ఫస్టియర్ మార్కులు 70 శాతం, పదో తరగతి మార్కులు 30 శాతం కలిపి ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు మార్కులను వేస్తామని.. ఈ నెలాఖరు లోపు మెమోలను విడుదల చేస్తామని తెలిపారు మంత్రి ఆదిమూలపు.